Appsc Questions: ఏపీ గ్రూప్‌1 మెయిన్స్‌లో “ఎల్లో జర్నలిజం”పై ప్రశ్నలు…-questions on yellow journalism in group 1 mains discussion on commission mode ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Questions On Yellow Journalism In Group 1 Mains, Discussion On Commission Mode

Appsc Questions: ఏపీ గ్రూప్‌1 మెయిన్స్‌లో “ఎల్లో జర్నలిజం”పై ప్రశ్నలు…

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

Appsc Questions: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలి కాలంలో విపక్షాల తీరును ఎండగడుతున్న ఏపీ సిఎం, పార్టీలతో పాటు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీడియాపై ఎల్లో జర్నలిజం అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షల్లో అవే ప్రశ్నలు రావడం చర్చగా మారింది.

Appsc Questions: సమకాలీన అంశాలపై అభ్యర్థుల అవగాహన పరిశీలించాలని భావించారో, ప్రభుత్వ పెద్దల్ని మెప్పించాలనుకున్నారో కానీ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఎల్లో జర్నలిజం-పోరాటం'పై గ్రూపు-1 అభ్యర్థులకు ప్రశ్న రావడంతో అభ్యర్థులు సమాధానాలు రాయడానికి సతమతం అయినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఏపీపీఎస్సీ ఏ ఉద్దేశంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో ఆ ప్రశ్నలు వేసిందో అర్థం కాకపోయినా అభ్యర్థులకు ఉన్న సామాజిక అవగాహన, ప్రస్తుత రాజకీయాలు, పాలన, విపక్షాల వ్యవహారశైలి, పత్రికల తీరు తెన్నులు వంటి విషయాల్లో అభ్యర్థులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఏపీపీఎస్సీ అధికార పార్టీకి బాసటగా నిలుస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గ్రూపు-1 మెయిన్స్‌ పరీక్షలో 'ఎల్లో జర్నలిజం' పై ప్రశ్న ఇవ్వడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గ్రూపు-1 ప్రధాన పరీక్షలో సోమవారం 'ఎల్లో జర్నలిజంపై పోరాటం' అనే ప్రశ్న ఇచ్చారు. తనకు నచ్చని పత్రికల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లో జర్నలిజం.. అంటూ పదేపదే మాట్లాడుతున్నారు.

అధికార పార్టీ నేతలు, మంత్రులు కూడా అదే బాటలో పత్రికలను తరచూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావడాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ 'ఎల్లో జర్నలిజంపై పోరాటం' అన్న ప్రశ్న ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యం-సోషల్‌ మీడియా పాత్ర గురించి కూడా మరో ప్రశ్న అడిగినట్లు గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తెలిపారు.

20 మార్కులకు ఐదు ప్రశ్నలు ఇచ్చి..ఒక దానికి జవాబు రాయాలన్న విభాగంలో ఈ రెండు ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురయ్యాయి గత వారం జరిగిన తెలుగు పరీక్షలో సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం అన్న అంశంపై కూడా ప్రశ్న వచ్చింది. మళ్లీ ఇంగ్లిషు పరీక్షలోనూ ఆ ప్రశ్న వచ్చింది. తెలుగు పరీక్షలో 'నాడు-నేడు' కింద చేపట్టిన నిర్మాణాల గురించి ప్రశ్న వచ్చింది. సోమవారం జరిగిన గ్రూపు-1 ప్రధాన పరీక్షకు 4,944 మంది హాజరయ్యారు.

WhatsApp channel