ఏపీలో మళ్లీ రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ విధానం రద్దు కావటంతో… రేషన్ కార్డుదారులు షాపుల వద్దకు వెళ్లి సరుకులను తీసుకుంటున్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీఠ వేస్తున్నామని… త్వరలోనే మరిన్ని మార్పులు తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
ఆదివారం పిఠాపురం పట్టణ పరిధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపులకుగానూ… 24,795 షాపుల్లో సరుకుల పంపిణీని ప్రారంభించామని చెప్పారు.
తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరుకులు లేవని తిప్పి పంపినా డీలర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. డీలర్లు ఈ-పోస్, వేయింగ్ మెషీన్ల పని తీరును ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరుకుల పంపిణీ చేయాలన్నారు.
“సరుకుల పంపిణీ సమాచార కోసం కొత్తగా ఒక యాప్ ను డిజైన్ చేశాం. ఏ రోజు ఎంత రేషన్ పంపిణీ చేశాం..? ఎంత మందికి అందించాం? వంటి విషయాలు ఎప్పటికప్పుడు నమోదయ్యేలా చూస్తున్నాం. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేలా రేషన్ షాపుల్లో వద్ద భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. లబ్ధిదారులకు ఏదైనా సమస్య తలెత్తితే సులువుగా ఫిర్యాదు చేసేలా షాపు వద్దే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు” అని మంత్రి నాదెండ్ల ప్రకటించారు.
ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరకులు తెచ్చుకోవచ్చని సూచించింది. ఇక దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకి ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిచేలా చర్యలు తీసుకున్నట్లు సర్కార్ తెలిపింది.
సంబంధిత కథనం