అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు ర‌ద్దు!-pushpa yagam in tirumala srivari temple on october 30 cancellation of arjitha sevas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు ర‌ద్దు!

అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు ర‌ద్దు!

Anand Sai HT Telugu

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 30న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవలు ర‌ద్దు

అక్టోబర్ 29న అంకురార్పణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల‌, అర్చన సేవ‌లు ఏకాంతంగా నిర్వహిస్తారు.

పరకామణి చోరీ కేసు దర్యాప్తు

మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు మెుదలుపెట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర్యటించింది. శ్రీవారి ఆలయ పరకామణి పరిశీలన చేసింది. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన రికార్డులను చూసింది.

2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ అయిన విషయం తెలిసిందే. 920 డాలర్లను చోరీ చేస్తూ.. టీటీడీ ఉద్యోగి రవికుమార్ దొరికాడు. దీనిపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ చేయలేదని ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు ఆదేశాలతో కేసును సీఐడీ తిరిగి దర్యాప్తు చేస్తోంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.