తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు మెుదలుపెట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర్యటించింది. శ్రీవారి ఆలయ పరకామణి పరిశీలన చేసింది. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన రికార్డులను చూసింది.
2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ అయిన విషయం తెలిసిందే. 920 డాలర్లను చోరీ చేస్తూ.. టీటీడీ ఉద్యోగి రవికుమార్ దొరికాడు. దీనిపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ చేయలేదని ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు ఆదేశాలతో కేసును సీఐడీ తిరిగి దర్యాప్తు చేస్తోంది.