నాగ దోషం ఉంది హోమం చేయాలని యువతిపై లైంగిక దాడికి యత్నించిన పూజారి-priest accused of sexual assault during religious ritual ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నాగ దోషం ఉంది హోమం చేయాలని యువతిపై లైంగిక దాడికి యత్నించిన పూజారి

నాగ దోషం ఉంది హోమం చేయాలని యువతిపై లైంగిక దాడికి యత్నించిన పూజారి

HT Telugu Desk HT Telugu
Jan 13, 2025 05:39 PM IST

యువ‌తి జాత‌కం చూసిన ఓ పూజారి నాగ‌దోషం ఉందని, దీనికి పరిహారంగా హోమం చేయాల‌ని చెప్పాడు. ఆ తరువాత లైంగిక దాడికి యత్నించాడు.

పూజల పేరుతో యువతిపై లైంగిక దాడి
పూజల పేరుతో యువతిపై లైంగిక దాడి (Representational/ Pixabay)

కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువ‌తి జాత‌కం చూసి నాగ‌దోషం హోమం చేయాలని చెప్పిన పూజారి ఆమెపై లైంగిక దాడికి య‌త్నించాడు. ఈ మేరకు యువతి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌త నెల 31న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

రాజ‌మండ్రి రూర‌ల్ మండ‌లంలోని కోల‌మూరు గ్రామానికి చెందిన యువ‌తి త‌న వివాహం, ఉద్యోగం విష‌యంలో ఇబ్బందులు ప‌డుతోంది. దీంతో త‌న‌కు తెలిసిన వారి ద్వారా జంగారెడ్డి గూడెం ల‌లితాదేవి ఆల‌యంలో అర్చ‌క‌త్వం చేస్తున్న కొత్త‌పేట మండ‌లం మంద‌ప‌ల్లి స‌మీపంలోని ఏనుగుల మ‌హల్ గ్రామానికి చెందిన పండు పంతులు అనే పూజారిని సంప్ర‌దించింది. ఆయ‌న జాత‌కం చూసి నాగ‌దోషం ఉంద‌ని యువ‌తికి చెప్పాడు. హోమం చేయాల‌ని చెప్పి ర‌మ్మ‌న్నాడు. అందుకు తేదీ కూడా ఆయ‌నే నిర్ణ‌యించాడు. తిరిగి తేదీని, స్థలాన్ని మార్చాడు.

దాడికి యత్నం ఇలా

ల‌లితాదేవి ఆల‌యానికి బ‌దులు రావుల‌పాలెం ద‌గ్గ‌ర మంద‌ప‌ల్లి శ‌నైశ్చ‌రస్వామి ఆల‌యానికి మార్చాడు. ఆయ‌న చెప్పిన ప్రకారం డిసెంబ‌ర్ 31న మ‌ధ్యాహ్నం ఆమె రావుల‌పాలెంలోని ద‌గ్గ‌ర మంద‌ప‌ల్లి శ‌నైశ్చ‌ర‌స్వామి ఆల‌యానికి వెళ్లింది. ఆమె ఆల‌యానికి చేరుకున్న త‌రువాత ఆమెకు శ‌నిదోష నివార‌ణ‌కు హోమం చేయించారు. ఈ క్ర‌మంలో ఆమె చేతులు ప‌ట్టుకుని హోమం చేయిస్తుండ‌గా ఆమె ఇబ్బంది ప‌డింది. తాను ఇబ్బంది ప‌డుతున్నాన‌ని పూజారికి చెప్పింది. అయితే ఆయ‌న ఈ హోమం, పూజ ఇలానే చేయించాల‌ని, క‌నుక స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న అన్నాడు. దీంతో ఆమె ఇబ్బంది ప‌డుతునే పూజ చేసింది.

పూజ అనంత‌రం స్నానం చేయాల‌ని పూజారి చెప్పడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. వెంట‌నే పూజారి బాత్‌రూమ్ లోప‌ల‌కి చొర‌బ‌డి అస‌భ్య‌కరంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో ఆమె గ‌ట్టి కేక‌లు, అరుపులు వేస్తూ ఆ పూజారిని బ‌య‌ట‌కు నెట్టేసింది. షాక్‌కు గురై ఆ యువ‌తి భ‌యంతో తిరిగి రాజ‌మండ్రి వెళ్లి పోయింది. రాజ‌మండ్రిలోని మ‌హిళ పోలీస్ స్టేష‌న్‌కు, జంగారెడ్డి గూడెం పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి మొర‌పెట్టుకుంది. ఫిర్యాదు ఇచ్చినా తీసుకోలేదని వాపోయింది. దీంతో కొత్త‌పేట పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. యువ‌తి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎస్ఐ సురేంద్ర మాట్లాడుతూ యువ‌తి నుంచి ఫిర్యాదు అందింద‌ని, కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు. ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని, ద‌ర్యాప్తు పూర్తి చేసిన అనంత‌రం త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయని పేర్కొన్నారు.

- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner