Polytech Fest 2022 : విజయవాడలో పాలిటెక్ ఫెస్ట్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
polytech fest in vijayawada : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులతో పాలిటెక్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా ప్రొత్సహించేందుకు ఇది ఉపయోగపడనుంది.
ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్(polytechnic) ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మూడు రోజుల 'పాలిటెక్ ఫెస్ట్ - 2022' జరగనుంది. నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు విజయవాడ(Vijayawada)లో నిర్వహించనున్నట్టుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. సచివాలయంలో ఫెస్ట్ పోస్టర్ను విడుదల చేశారు మంత్రి.
ట్రెండింగ్ వార్తలు
ప్రతి రెండేళ్లకోసారి సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. అయితే, కరోనా వైరస్(Corona Virus) మహమ్మారి కారణంగా 2020లో నిర్వహించలేకపోయారన్నారు. ఈ సంవత్సరం, రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 173 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల(Polytechnic Colleges) బృందాలు విజయవాడలో రాష్ట్ర స్థాయి పాలిటెక్ ఫెస్ట్-2022లో పాల్గొంటాయి.
రాష్ట్రస్థాయి ఫెస్ట్కు ముందుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్(Technical Education) కమిషనర్ సి.నాగ రాణి తెలిపారు. ఈ పోటీల నుండి సుమారు 800 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పాలిటెక్ ఫెస్ట్-2022లో పాల్గొంటారు.
మొదటి సారిగా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తామని అన్నారు. జిల్లా స్థాయిలలో విజేతలు, రన్నరప్ జట్లకు ఒక్కొక్కరికి రూ.25,000, రూ.10,000 అందజేస్తారు. మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పరస్పరం పోటీపడతాయి. గెలిచిన జట్టు రూ.1,00,000 తీసుకుంటుంది. రెండో స్థానంలో నిలిచిన జట్టు రూ.50,000, మూడో స్థానం వచ్చిన జట్టు రూ.25,000 అందుకుంటారు.
వివిధ పాలిటెక్నిక్ కళాశాలల(Polytechnic Colleges) టీమ్లలో సాంకేతిక, మేధో స్ఫూర్తిని ప్రోత్సహించడానికి నగదు బహుమతులు అందించనున్నారు. విద్యార్థుల మధ్య పోటీల స్థాయిని పెంచేందుకు సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులు కూడా రానున్నారు.