Andhra Pradesh Politics : వారసులొస్తున్నారు.. జనంలోకి వెళ్లేలా యాత్రలు.. కానీ
Padayatra In Andhra Pradesh : అధికారంలోకి రావాలంటే పాదయాత్రలు అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే టికెట్ వస్తుందో లేదో క్లారిటీ లేకున్నా.. కొంతమంది వారసులు మాత్రం పాదయాత్రలు చేస్తున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్(NTR) ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అడుగుపెట్టి రోడ్డుపైకి వచ్చారు. రథయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. అప్పటి నుంచి.. రాజకీయ పార్టీలు(Political Parties), నాయకులు ఓటర్లను చేరుకోవడానికి యాత్రలు లేదా రోడ్షోలు ప్రజాదరణ పొందిన సాధనంగా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా(Social Media) యుగంలో కూడా, లైక్లు, షేర్లు ప్రచారం వేగాన్ని చూపిస్తున్నా.. అన్ని పార్టీలూ.. తమ సందేశాలను చెప్పేందుకు యాత్రలను కొనసాగిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
అసెంబ్లీ, లోక్సభ(Lok Sabha) ఎన్నికలు దూరంగా ఉన్నా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం(Telugu Desam) నాయకులు పాదయాత్రలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ నాయకుల వారసులు పాదయాత్రకు దిగడం విశేషం. టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్(Nara Lokesh), కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు, కూతుళ్లు యాత్రలు ప్లాన్ చేస్తున్నారు.
టీడీపీ వచ్చే ఎన్నికలే టార్గెట్ గా లోకేష్ ఏపీలో 450 రోజుల పాదయాత్రను చేపట్టనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రోజు నుంచి ఆయన చిత్తూరు నుంచి యాత్రను ప్రారంభించి 2024 మార్చిలో శ్రీకాకుళం(Srikakulam)లో ముగిస్తారు. రూట్ మ్యాప్, ఇతర రాజకీయ కార్యక్రమాలపై కసరత్తు జరుగుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా కొంతమంది YSRCP ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఓటర్లను చేరుకుని ప్రభుత్వ సంక్షేమ పనులను వారికి తెలియజేస్తున్నారు. సిట్టింగ్ శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు 2024 ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంతమంది వారసులు.. ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ టిక్కెట్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
వారి పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పి.కృష్ణ మూర్తి (పేర్ని నాని కుమారుడు), ఎస్. ప్రసాద్, (సామినేని ఉదయ భాను), బి. ప్రణీత్ రెడ్డి (బాలినేని శ్రీనివాస్ రెడ్డి), టి. పృథ్వీ రాజ్ (తోట త్రిమూర్తులు), కార్తీక్ రెడ్డి (శిల్పా చక్రపాణి రెడ్డి), బి. అభినయ్ రెడ్డి (భూమన కరుణాకర్ రెడ్డి), సిహెచ్. మోహిత్ రెడ్డి (చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి), ఎం. రిషిక, (మేకతోటి సుచరిత కుమార్తె), బి.పవిత్ర (బియ్యపు మధుసూదన్ రెడ్డి), కె.శ్రావణి (కోలగట్ల వీరభద్ర స్వామి) వారసులు జనాల్లోకి వెళ్తున్నారు.
ఈ యువ వైసీపీ నేతలు ఎక్కువ మంది ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వంతో పాదయాత్ర చేపట్టారు. తిరుపతి రూరల్లో ఇటీవలే ప్రభుత్వ విప్, చంద్రగిరి(Chandragiri) ఎమ్మెల్యే భాస్కర్రెడ్డి తనయుడు మోహిత్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర నియోజకవర్గంలోని మొత్తం 1.42 లక్షల ఇళ్లను కవర్ చేసేలా ప్లాన్ చేశఆరు. వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఇది పూర్తి చేయడానికి 200 రోజులు పడుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వారసులుగా వచ్చేందుకు ఇలా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.
సంబంధిత కథనం