Kadapa Pocso Case: కడప జిల్లా పొద్దుటూరులో దారుణం.. 9వ తరగతి విద్యార్ధిపై పోక్సో కేసు నమోదు…-pocso case registered against a 9th grade student in kadapa ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Pocso Case: కడప జిల్లా పొద్దుటూరులో దారుణం.. 9వ తరగతి విద్యార్ధిపై పోక్సో కేసు నమోదు…

Kadapa Pocso Case: కడప జిల్లా పొద్దుటూరులో దారుణం.. 9వ తరగతి విద్యార్ధిపై పోక్సో కేసు నమోదు…

HT Telugu Desk HT Telugu

Kadapa Pocso Case: ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి తోటి విద్యార్ధినులను వేధించడంతో పాటు మందలించిన అధ్యాపకులపై తప్పుడు కేసు పెట్టించిన విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. విద్యార్ధితో పాటు అతని తల్లిదండ్రులు, వారికి సహకరించిన కౌన్సిలర్‌పై కేసు నమోదు చేశారు.

కడపలో 9వ తరగతి విద్యార్థినులకు బాలుడి వేధింపులు

Kadapa Pocso Case: 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థినులను వేధించాడు. వారి ఇన్‌‌స్టా గ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేయడంతో పాటు వేధింపులకు పాల్పడ్డాడు. గత వారం స్కూల్లో ఈ విషయం బయటపడటంతో ఉపాధ్యాయుడు మందలించి దండించారు.

తరగతిలో తమ కుమారుడిని ఉపాధ్యాయుడు అకారణంగా కొట్టారంటూ బాలుడి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో విద్యార్థి నిర్వాకం, తల్లిదండ్రుల తీరు బయటపడటంతో వారిపై కేసు నమోదు చేశారు.

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన 9వ తరగతి చదివే బాలుడు తనతో చదువుకునే బాలికల ఇన్స్టా గ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశాడు. అదే తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థినుల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఫొటోలను సేకరించాడు. ఆ ఫోటోలను మగపిల్లలకు పంపి వారిని వేధిస్తున్నాడు. బాలుడి నిర్వాకం తెలియడంతో గత వారం టీచర్లు అతడిని మందలించడంతో పాటు చేయి చేసుకున్నారు.

బాలుడు ఇంటికి వెళ్లి తనను ఉపాధ్యాయులు అకారణంగా కొట్టారని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయుల్ని నిలదీశారు. వారితో పాటు స్థానిక కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయుల్ని బెదిరించాడు. ఆపై పొద్దుటూరు రూరల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

బాలుడి తల్లిదండ్రుల నిర్వాకంతో వేధింపులకు గురైన విద్యార్ధినుల తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. బాలుడి నిర్వాకాన్ని వివరించారు. తమ పిల్లలను బాలుడు వేధించిన తీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రొద్దుటూరు ఎంఈవో సావిత్రమ్మ, రూరల్ సీఐ బాల మద్దిలేటి పాఠశాలలో విచారణ నిర్వహించారు. తప్పు చేసిన కుమారుడికి వంత పడిన తల్లిదండ్రులతో పాటు కౌన్సిలర్ మురళీధర్‌ రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సురేశ్ తెలిపారు.

బాలుడి వికృత చేష్టలు..

రాయ‌ల‌సీమ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు ప్రొద్దుటూరులోని స్కూల్‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అదే స్కూల్‌కు చెందిన ఐదుగురు అమ్మాయిల ఇన్‌స్టాగ్రామ్ ఐడీల‌ను హ్యాక్ చేసి 9,10 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న అబ్బాయిల‌కు అమ్మాయిల వ్య‌క్తిగ‌త మొబైల్ ఫోన్ నంబ‌ర్ల‌ను పంపించేవాడు. అక్క‌డితో ఆగ‌కుండా అమ్మాయిల‌ను వేధించేందుకు కొత్త‌కొత్త నేరాల‌కు పాల్ప‌డ్డాడు.

ఆడ పిల్ల‌ల ఫోటోల‌తో కొత్త ఇన్‌స్టాగ్రామ్ ఐడీల‌ను త‌యారు చేసి అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బాలిక‌ల‌కు మెసేజ్‌లు చేస్తూ త‌న‌ను ప్రేమించాల‌ని వేధించేవాడు. త‌న‌ను ప్రేమించ‌క‌పోతే మీ ఫోన్ నంబ‌ర్ల‌ను అబ్బాయిల‌కు ఇస్తాన‌ని, ఫోటోల‌ను, వీడియోల‌ను అస‌భ్య‌క‌రంగా సామాజిక మాధ్య‌మాల్లో పెడ‌తాన‌ని బెదిరించేవాడు. ఇలా 32 ఫేక్ ఐడీల‌ను క్రియేట్ చేసి ప్రేమించ‌కుంటే మీ వ్య‌క్తిగ‌త ఫోటోలు, వీడియోలు అంద‌రికీ షేర్ చేస్తాన‌ని బాలిక‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేసేవాడు.

బాలుడి తల్లిదండ్రుల నిర్వాకంతో త‌మ పిల్ల‌ల‌ను కాపాడాల‌ని బాధిత బాలికల త‌ల్లులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి త‌ల్లిదండ్రులు కొండ‌మ్మ‌, మాధ‌వ‌రెడ్డిల‌తో కౌన్సిలర్ మురళీధర్‌ రెడ్డిలపై పోక్సో కేసుతో స‌హా బీఎన్ఎస్‌లోని సెక్ష‌న్ 78, 351 (2), రెడ్‌విత్ 3 (5) కింద కేసులు న‌మోదు చేశారు.

సంబంధిత కథనం