పోక్సో కేసు నిందితుడి దారుణం… రాజీకి రాలేదని బాలిక తండ్రిని హత్య చేసిన లారీ డ్రైవర్-pocso case accuseds brutality lorry driver murdered girls father for not accepting compromise deal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పోక్సో కేసు నిందితుడి దారుణం… రాజీకి రాలేదని బాలిక తండ్రిని హత్య చేసిన లారీ డ్రైవర్

పోక్సో కేసు నిందితుడి దారుణం… రాజీకి రాలేదని బాలిక తండ్రిని హత్య చేసిన లారీ డ్రైవర్

Sarath Chandra.B HT Telugu

నిడదవోలులో దారుణ హత్య జరిగింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న లారీ డ్రైవర్‌ బాధితురాలి తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు. పోక్సో కేసులో రాజీకి రావాలని ఒత్తిడి చేసినా వినక పోవడంతో మాటువేసి హత్య చేశాడు. తూర్పు గోదావరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

నిడదవోలులో దారుణ హత్య

నిడదవోలులో దారుణ హత్య జరిగింది. నాలుగేళ్ల క్రితం ఇంటర్‌ బాలికను వేధించిన కేసులో అరెస్టైన నిందితుడు పోక్సో కేసులో శిక్ష నుంచి తప్పించుకోడానికి బాధితులతో రాజీ కుదుర్చుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో యువతి తండ్రిపై పగ పెంచుకుని మాటు వేసి హత్యకు పాల్పడ్డాడు.

మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో వేధించిన లారీ డ్రైవర్‌ చివరకు ఆమె తండ్రిని హత్య చేసిన ఘటన నిడదవోలులో ఆదివారం జరిగింది. పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మాటు వేసి బాలిక తండ్రిని హత్య చేశాడు.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. నిడదవోలు సీఐ తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలు చింతచెట్టు వీధికి చెందిన షేక్‌ వల్లీభాషా వంట పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు 2021లో స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో లారీ డ్రైవర్‌ వెంటపడి వేధించే వాడు.

నిడదవోలు వైఎస్సార్‌ కాలనీకి చెందిన సిరంగుల అనిల్‌కుమార్‌పై వల్లీభాష పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితుడు బెయిల్‌పై ఉన్నాడు. పోక్సో కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ క్రమంలో పోక్సో కేసు వల్ల వివాహం కాకపోవడం, శిక్ష ఖరారైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇటీవల రాజీ ప్రయత్నాలు చేశాడు.

వల్లీ భాష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. తన ప్రతిపాదన అంగీకరించకపోతే చంపుతానని బెదిరించాడు. దీనికి వల్లీభాష ఒప్పుకోలేదు. ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో షాపు తెరిచేందుకు వచ్చిన భాషపై నాటు కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచేశాడు.

గొంతు కోయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య చేసిన అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కైన వల్లీభాష ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం