Modi Tour : 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ.. మన్యం వీరుడి వారసులతో మోదీ భేటీ
సోమవారం ఏలూరు జిల్లా భీమవరంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
ట్రెండింగ్ వార్తలు
మన్యం వీరుడు.. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ సోమవారం భీమవరం రానున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన అల్లూరి విగ్రహం బరువు 15 టన్నులు. మన్యం వీరుడి వారసులతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమైంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భీమవరం పట్టణంలో పారా మిలటరీ, సెంట్రల్ సెక్యూరిటీ సిబ్బందితో కలిపి 5 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని భీమవరం, కాళ్ల, పాలకోడేరు, ఉండి, మొగల్తూరు, నర్సాపురం, పాలకొల్లు, ఆకివీడు తదితర మండలాల్లో పోలీసు బందోబస్తును పెంచారు. జులై 4న ప్రధాని పర్యటన నిమిత్తం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన తర్వాత మోదీ హెలికాప్టర్లో భీమవరం వెళ్తారు. ప్రధాని, ఇతర ఉన్నతాధికారుల పర్యటన కోసం నాలుగు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో భీమవరం వరకు ప్రధాని ప్రయాణానికి రాష్ట్ర పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. భీమవరం వరకు అనుమతించిన మార్గంలో పోలీసులు భద్రతను పెంచారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరం శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సినీనటుడు చిరంజీవి తదితరులు పాల్గొంటారు.