ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తుంది. 2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకూ 19 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించారు. మరికొన్ని రోజుల్లో పీఎం కిసాన్ 20వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
పీఎం కిసాన్ 20వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంది. ముందు రైతుల బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ చేయాలి. దీంతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకుని 11 అంకెల నెంబర్ పొందాలి. ఆపై ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లో నగదు పడనుంది.
పీఎం కిసాన్ నిధులను ప్రతీ ఏటా మూడు విడతల్లో విడుదల చేస్తారు. అంటే 4 నెలల వ్యవధిలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తారు. 18వ విడత గతేడాది అక్టోబర్ నెలలో, 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైంది. 20వ విడత జూన్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
రైతులు e-KYC చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు. గతంలో ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసీ పూర్తి అయ్యేది. ప్రస్తుతం బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి. ఇందుకు మీ సమీపంలోని CSC కేంద్రం లేదా మీ-సేవను సందర్శించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ముందుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులకు 11 అంకెల గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు తరహాలో రైతులకు ఓ ప్రత్యేక డిజిటల్ ఐడీ కార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్డును రైతు ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, పంటలు, అప్పులు, పీఎం కిసాన్ లబ్ధి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుతో బ్యాంకు రుణాలు సులభంగా పొందవచ్చు. గతంలో రైతులు రుణాల కోసం పట్టాదారు పాసుపుస్తకం, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే బ్యాంకులు రుణాలు అందిస్తాయి.
పీఎం కిసాన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇతర వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చు.
రైతు పేరు, భూమి, పంటల వివరాలు, ఇతర సమాచారం ఒకే చోట పొందవచ్చు.
త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు, ఫోన్ నంబర్ను ఏపీలో అయితే గ్రామ, వార్డు సచివాలయంలో, తెలంగాణలో మండల వ్యవసాయ విస్తరణాధికారికి అందిస్తే వారు ఆన్లైన్లో నమోదు చేసి, 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు జారీ చేస్తారు.
సంబంధిత కథనం