PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్, శిక్షణతో పాటు ఏడాదికి రూ.60 వేలు-దరఖాస్తు ఇలా-pm internship scheme 2024 eligibility benefits how to apply online registration process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్, శిక్షణతో పాటు ఏడాదికి రూ.60 వేలు-దరఖాస్తు ఇలా

PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్, శిక్షణతో పాటు ఏడాదికి రూ.60 వేలు-దరఖాస్తు ఇలా

PM Internship Scheme 2024 : ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్రం శ్రీకారం చుట్టింది. రూ.800 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్, శిక్షణతో పాటు ఏడాదికి రూ.60 వేలు-దరఖాస్తు ఇలా

PM Internship Scheme 2024 : ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు..ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా టాప్ కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఇంటర్న్‌లకు బీమా కవరేజీని కూడా అందిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేయనుంది.

21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించే పోర్టల్ ద్వారా, భాగస్వామ్య సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించవచ్చని కేంద్రం తెలిపింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం టాప్ కంపెనీలను గత మూడేళ్లలో వారి సీఎస్ఆర్ ఖర్చుల ఆధారంగా గుర్తించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇంటర్న్‌షిప్ అవకాశాలను కోరుకునే అభ్యర్థులు అక్టోబర్ రెండో వారం నుంచి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఏటా రూ.60 వేలు ఆర్థిక సాయం, బీమా కవరేజీ

ఈ పథకంలో కంపెనీలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. 12 నెలల పాటు యువతకు ఇంటర్న్‌షిప్ అందిస్తారు. తరగతి గదిలో కాకుండా ప్రాక్టికల్ గా ఇంటర్న్ లకు శిక్షణ ఇస్తారు. ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఈ పథకంలో పాల్గొనవచ్చు. టాప్ 500 కంపెనీలు ప్రాతినిధ్యం వహించని రంగాలు, ప్రాంతాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్న్‌లకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తంలో రూ. 4,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కంపెనీ తన సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 500 చెల్లిస్తుంది.

అలాగే ఇంటర్న్‌షిప్ స్థానంలో చేరిన తర్వాత, ప్రతి ఇంటర్న్‌కు ఇన్‌సిడెంట్‌ల కోసం రూ.6,000 గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ పథకం కింద ఇంటర్న్‌ల శిక్షణకు సంబంధించిన ఖర్చులను కంపెనీ తన సీఎస్ఆర్ నిధుల నుంచి వినియోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్‌కు బీమా కవరేజీ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రీమియం కేంద్ర ప్రభుత్వమే కడుతుంది.

అర్హులు

ఆన్‌లైన్ / దూరవిద్య ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న అభ్యర్థులు, హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా కలిగిన వారు లేదా బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మా డిగ్రీలు కలిగి ఉన్నవారు అర్హులు.

కంపెనీలు ఆన్ లైన్ పోర్టల్‌లో ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటాయి. ఇక్కడ ఇంటర్న్‌షిప్ అవకాశాలను పోస్ట్ చేస్తారు. లొకేషన్, అవసరమైన అర్హతలు, సౌకర్యాలు పోస్టు చేస్తారు. అర్హత గల అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులు గరిష్టంగా ఐదు విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్ pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి 25 వరకు అభ్యర్థులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులను అక్టోబర్ 26 న షార్ట్‌లిస్ట్ చేస్తారు.