Janasena Vs Ysrcp Sticker War : మరో వారంలో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ గడువు దగ్గరపడుతుండడంతో నాయకులతో పాటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎక్కువౌతుంది. ఇంకా ఫలితాలు రాకుండా అప్పుడు జనసేన, వైసీపీ స్టిక్కర్ల వార్ మొదలుపెట్టాయి. 'ఎమ్మెల్యే తాలుకా' అంటూ తమ వాహనాలపై స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అని జనసైనికులు పోస్టులు పెడుతుంటుంటే, డిప్యూటీ సీఎం, వంగా గీతా తాలుకా అంటూ వైసీపీ మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎవరి భవితవ్యం ఏంటో తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనుండగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో స్టిక్కర్ల వార్ నడుస్తోంది. వైసీపీ అభ్యర్థి వంగా గీత, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతుదారులు బైక్లు, కార్లు, మొబైల్ ఫోన్లపై ఎమ్మెల్యే తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. తమ అభ్యర్థుల గెలుపు తథ్యం అంటూ ముందస్తుగా ఇలా స్టిక్కర్లతో మద్దతు తెలుపుతున్నారు. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ పవన్ కల్యాణ్ అనుచరులు స్టిక్కర్లు అతికించుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీ ప్రకారం 'డిప్యూటీ సీఎం గారి తాలూకా' అనే స్టిక్కర్లతో వంగా గీత అనుచరులు స్టిక్కర్లు పెడుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే వంగా గీతను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఏపీలో ఇప్పుడు స్టిక్కర్ల వార్ నడుస్తోంది. పిఠాపురం పాటు భీమవరం, కాకినాడ, రాజోలులో ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తాలూకా అంటూ ఆయా పార్టీల మద్దతుదారులు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. సాధారణంగా అధికార పార్టీ మద్దతుదారులు ఈ విధంగా చేస్తుంటారు. పోలీసులు, ట్రాఫిక్, ఇతర సమస్యలు లేకుండా ఉండేందుకు , తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని పరోక్షంగా చెప్పుకుంటూ...తమ వాహనాలపై అధికార పార్టీ జెండాలు, నాయకుల ఫొటోలు పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఫలితాలు విడుదల కాకుండానే తమ అభ్యర్థి అంటూ స్టిక్కర్లు పెట్టుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా ఫలితాలు వరకూ వేచిచూడాలని, తొందర పనిచేయదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాష్ట్రం మొత్తం పిఠాపురం స్థానం వైపు చూస్తుంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఈసారి విజయం సాధిస్తారా? అసెంబ్లీలో అడుగుపెడతారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దీంతో ఈసారి ఒక్కస్థానం నుంచే తాడోపేడో తేల్చుకుంటానని పిఠాపురం బరిలో నిల్చారు పవన్. వైసీపీ వంగా గీతను ప్రత్యర్థిగా నిలిపింది. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. ఈ హోరాహోరీ పోటీలో ప్రజలు ఎవరికి జై కొట్టారో జూన్ 4న తెలియనుంది. అయితే పిఠాపురం గెలుపుపై భారీగా బెట్టింగ్ నడుస్తోంది. లక్షకు లక్షన్నర అంటూ పవన్ కల్యాణ్ విజయంపై బెట్టింగ్ లు కాస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ మెజార్టీపైనా బెట్టింగులు సాగుతున్నాయి.
సంబంధిత కథనం