TTD Facial Recognition: ముఖ గుర్తింపుతో టీటీడీకి అదనపు లాభం...
TTD Facial Recognition: తిరుమలలో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు ఆధారిత సేవలతో టీటీడీకి లబ్ది చేకూరుతున్నట్లు గుర్తించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో టీటీడీ గదుల లభ్యత గణనీయంగాా పెరిగినట్లు గుర్తించారు. కొత్త విధానాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు.
TTD Facial Recognition: టీటీడీ కొద్ది వారాల క్రితం అమల్లోకి తీసుకు వచ్చిన ముఖ గుర్తింపు ఆధారిత సేవలతో భక్తులకు సౌకర్యవంతంగాను, టీటీడీకి లాభసాటిగాను ఉంటోందని అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డు కట్ట వేసేందుకు ప్రారంభించిన ముఖ గుర్తింపు ఆధారిత సేవలతో గదుల లభ్యత గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. వేసవిలో కొత్త విధానం భక్తులకు మరితం లబ్ది చేకూరుతుందని చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు దర్శనం, వసతిలో ఇబ్బందులు కలగకుండా తితిదే చర్యలు తీసుకుంటోందని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల వచ్చే భక్తులను దోచుకునే దళారులు, అక్రమార్కుల కారణంగా ికపై భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురు కావని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎదురవుతున్న సమస్యలకు అడ్డు కట్ట వేసేందుకు కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మొదలుకుని ఉచిత లడ్డూల పంపిణీ కేంద్రాల వద్ద అమలుచేస్తోన్న ముఖ గుర్తింపు ఆధారిత సాంకేతికతతో సత్ఫలితాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల కోసం దాదాపు 7,200 గదులు అందుబాటులో ఉన్నాయి. పద్మావతి విచారణ కేంద్రం పరిధిలో సుమారు 1500 గదులు ఉండగా, ఆన్లైన్ ద్వారా మరో 1500 గదులు కేటాయిస్తున్నారు. 3500 గదులను కరెంట్ బుకింగ్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్నారు.
గదుల కేటాయింపు కేంద్రాల వద్ద కొందరు దళారులు, అక్రమార్కులు ఇతరుల పేరుతో గదులు పొంది వాటిని ఎక్కువ ధరలకు ఇతరులకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి అడ్డుకట్టవేసేందుకు మార్చి 1వ నుంచి ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త విధానంలో ఎవరైతే గదిని పొందుతారో వారే వచ్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది.
కాషన్ డిపాజిట్ రిఫండ్ కోసం కూడా గదిని పొందిన భక్తుడే కౌంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి ఆధార్ కార్డుతో గదులను పొందిన భక్తుడు మరో 30 రోజులపాటు పొందే అవకాశం ఉండదు. గతంలో సీఆర్వోతోపాటు మిగిలిన ప్రాంతాల్లోని వసతి గదుల రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద భక్తుడు ఆధార్తో వివరాలు నమోదు చేసుకుంటే మెసేజ్లు వచ్చేందుకు కొన్ని గంటల సమయం పట్టేది. కొత్త సాంకేతికతతో ఐదు, పది నిమిషాల్లోనే భక్తులకు మేసేజ్లు వస్తున్నాయి. దీంతో గదుల కేటాయింపు వేగంగా జరుగుతోందని చెబుతున్నారు.
టీటీడీకి భారీగా ఆదాయం…
తిరుమలలో భక్తులకు వేగంగా గదుల లభ్యమవడంతో వసతి గృహాల్లో ఆక్యుపెన్సీ రేటు కూడా 86 శాతం నుంచి 108 శాతానికి పెరిగింది. ఒక గదిని ఒక భక్తుడు పొంది ఖాళీ చేసిన తర్వాత శుభ్రం చేసి మరో భక్తుడికి కేటాయిస్తున్నారు. ఒక్కో సారి ఓ గదిని రోజులో మూడుసార్లు కూడా కేటాయిస్తున్నారు. దీంతో తిరుమల దేవస్థానానికి భారీగా ఆదాయం పెరిగింది. గదుల కేటాయింపు ద్వారా గత ఏడాది డిసెంబరులో రూ.2.65 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరిలో రూ.2.39 కోట్లు వచ్చింది. ఈ నెల 1 నుంచి 12వ తేదీ వరకు గదుల కేటాయింపుతో టీటీడీకి అత్యధికంగా రూ.2.95 కోట్లు రాబడి వచ్చింది. గదుల కేటయింపులో అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో పాటు, దర్శనాలు ముగించుకుని వెళ్లే వారి స్థానంలో ఇతరులకు కేటాయించడం ద్వారా ఆదాయం పెరిగినట్లు భావిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేగంగా గదులు అందించడంతో పాటు దళారులు, అక్రమార్కుల బారిన పడకుండా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఫలితంగా తిరుమలలో గదుల లభ్యత భారీగా పెరిగిందని చెబుతున్నారు. రిజర్వేషన్ కాంప్లెక్స్ల వద్దకు వచ్చే భక్తులకు నిమిషాల వ్యవధిలోనే గదులు లభిస్తున్నాయని వివరించారు.