ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు - ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? 'పీపుల్స్ పల్స్' సర్వేలో తేలిన విషయాలివే-people pulse research institute conducted a survey on the ap free gas cylinder scheme deepam 2 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు - ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? 'పీపుల్స్ పల్స్' సర్వేలో తేలిన విషయాలివే

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు - ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? 'పీపుల్స్ పల్స్' సర్వేలో తేలిన విషయాలివే

HT Telugu Desk HT Telugu

ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్(దీపం -2 ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సంతృప్తి, సవాళ్లు, మెరుగుదల వంటి వివిధ అంశాలపై పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సర్వేలో తేలిన విషయాలెంటో పూర్తి కథనంలో చూడండి….

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం - పీపుల్స్ పల్స్ సర్వే ప్రజాభిప్రాయం

రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఏపీలోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే... లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి.

ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా లబ్దిదారుల్లో సంతృప్తి స్థాయిని అధిక స్థాయిలో పెంచే అవకాశం ఉంది. తద్వారా పథకానికి మరింత జనాదరణ లభించడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఎన్నికల హామీని పకడ్బందీగా అమలు చేస్తోందన్న రాజకీయ లబ్ది ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు దక్కుతుందని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ జరిపిన పైలట్ సర్వే స్పష్టం చేస్తోంది.

ఈ పథకాన్ని రూపాయి అదనపు భారం లేకుండా సంస్కరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. పథకం అమలు, లబ్దిదారుల మనోగతం, వారి సాధకబాధకాలతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణను వారెలా కోరుకుంటున్నారో ఈ సర్వేలో వెల్లడైంది.

ఎంత వరకు ప్రభావం ఉంది..?

  • 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ఈ స్కీమ్ పట్టాలెక్కింది. దీపావళినాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.
  • దాదాపు రూ.3 వేల కోట్లు ఈ పథకానికి ఖర్చు పెడుతున్నప్పటికీ... ఈ పథకం పట్ల ప్రజలు సంతృప్తి పొందడటం లేదని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన పైలట్ సర్వేలో స్పష్టమవుతోంది.
  • ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మొదటి విడతలో దాదాపు 97 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పూర్తి చేసుకుని, రెండో విడత పంపిణీ కూడా మొదలయింది.
  • మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి దాదాపు రూ.800 కోట్ల ఖర్చు చేసినా... ఈ పథకంపై ప్రజల్లో పెద్దగా చర్చ లేదు. లబ్దిదారులు సంతృప్తిగా కూడా లేరు.
  • ఈ పథకం ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయలేదని, అమలు జరుగుతున్న తీరు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
  • ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తప్ప ఇతర మంత్రులు ఓన్ చేసుకోలేదు. కేవలం వీరు ఇద్దరు మినహా ఇతర ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు సైతం పట్టించుకోకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఈ పథకానికి తగినంత ప్రచారం లభించటంలేదు.
  • ఈ పథకంపై సమర్థవంతమైన ప్రకటలు ఇవ్వడం, ప్రజల్లోకి చేరేలా క్యాంపెయిన్ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశాల కారణంగా పథకం ప్రజల్లో అంత ప్రభావం చూపలేకపోతున్నట్టు స్పష్టమవుతోంది.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-)పై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సంతృప్తి, సవాళ్లు, మెరుగుదల వంటి వివిధ అంశాలపై పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అధ్యయనం చేసింది.

ఎ. పథకం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా..?

బి. డబ్బులు ఖాతాలో జమ చేయాలా? లేక నేరుగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా..?

సి.డబ్బులు ఎన్ని రోజులకు పడుతున్నాయి..?

డి.మూడు సిలిండర్లు ఏడాదికి సరిపోతున్నాయా..?

ఈ. ఉచిత గ్యాస్ వల్ల ఖర్చులు తగ్గాయా..?

ఎఫ్. ఏవైనా సమస్యలు ఉన్నాయా? మార్పులు కోరుతున్నారా..?

జి. ఈ పథకం వల్ల కూటమికి పొలిటికల్ డివిడెంట్ లభిస్తోందా..?

ఇటువంటి పలు రకాల ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టడం ద్వారా.... ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాస్త్రీయ సర్వే జరిపాము. 500 శాంపిల్స్ తో 2025 మే 5 నుంచి 2025 సర్వే జరిగింది. మే18 వరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మధ్యాంద్ర, గోదావరి జిల్లాల్లో ముఖాముఖి పైలట్ సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది.

దీపం -2 స్కీమ్ అమలు - ఖర్చు వివరాలు:

  1. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఉచిత గ్యాస్ సిలిండర్ ‘దీపం-2’ పథకానికి అర్హులు. రాష్ట్రంలోదాదాపు 1 కోటి 56 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో, ఈ పథకానికి అర్హులైన 1 కోటి 10 లక్షల మంది లబ్దిదారులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  2. వీరికి నాలుగు నెలలకో సిలిండర్ చొప్పున ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తే…. ఈ పథకానికి ఏడాదికి రూ.2800 కోట్ల వరకు ఖర్చవుతుంది. కానీ, రూ. 2684 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరాలంటే మరో రూ.125 కోట్లు ఈ పథకానికి అదనంగా కేటాయించాల్సి ఉంది.
  3. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర గరిష్ట ధర రూ.876 ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.25 సబ్సిడీ ఇస్తుండగా…. మిగిలిన రూ.851లను, సిలిండర్ అందిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఇంధన సంస్థల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తోంది. కానీ, ఆచరణలో ఈ ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంది.
  4. మొత్తం లబ్దిదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఏడాదికి సరిపడే రూ 846 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గ్యాస్ కంపెనీలకు విడుదల చేస్తోంది. గ్యాస్ కంపెనీల వారు తిరిగి సిలిండర్ వారిగా… లబ్దిదారులు చెల్లించిన మొత్తాన్ని 48 గంటల్లో వారి వారి ఖాతాల్లో జమచేస్తున్నారు.
  5. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు ఇచ్చిన మొదటి రౌండ్ లో 97.59 లక్షల సిలిండర్లు బుక్ చేసుకోగా... వారి ఖాతాల్లో జమ చేసేందుకు రూ.846 కోట్ల రుపాయిల సబ్సిడీ నిధులు విడుదల చేసింది.
  6. ఇప్పుడు ఏప్రిల్-జూలై 2025 రెండో రౌండ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇందులో ఇప్పటికే 60.77 లక్షల సిలిండర్లు డెలవరీ చేయగా, 10.07 లక్షల మంది లబ్దిదారులకు రూ.81.16 కోట్ల సబ్సిడీ ఖాతాలో జమ అయినట్లు ప్రభుత్వం తన అధికార వెబ్ సైట్ లో అప్డేట్ చేసింది.

సంతృప్తిగానే ఉన్నారా?

  • పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ సర్వేలో పాల్గొన్న 80 శాతంమంది ‘ఉచిత గ్యాస్’ పథకం గురించి అడిగితేగానీ చెప్పలేదు.
  • పది మందిలో ఏడుగురు ఈ పథకం ద్వారా లబ్ది పొందినప్పటికీ... వారికి ఉచిత గ్యాస్ వచ్చినట్టు ఎక్కడా చెప్పడం లేదు.
  • ముందుగా డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసిన తర్వాత తిరిగి ఆ డబ్బులు వారి ఖాతాలో పడుతూ ఉండటంతో ఉచిత గ్యాస్ పొందామనే భావన వారిలో కలగడం లేదు.
  • అమలు విధానం, పద్ధతి పట్ల ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయితే వేన్నిళ్లకు చన్నీళ్లలాగా…. పెరుగుతున్న నిత్యవసర ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం పట్ల ప్రజల్లో 90 శాతం మంది సంతృప్తిగానే ఉన్నారు. గ్రామీణ మహిళల్లో ఈ పథకం పట్ల సంతృప్తి చాలా ఎక్కువగా ఉంది.

నేరుగా ఇస్తేనే బెటర్…!

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉచిత గ్యాస్ పథకం ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు అమలు చేయాలా? లేక మార్పు చేయాలా? వంటి ప్రశ్నలను కూడా సంధించారు. నూటికి నూరు శాతం జీరో బిల్లుతో ఫ్రీగా గ్యాస్ సిలిండర్ డెలవరీ చేయాలని మెజార్టీ ప్రజలు కోరారు. ముందుగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించి… ఆ తర్వాత 48 గంటల్లో ఆ డబ్బును ఖాతాలో జమ చేయడం వల్ల ప్రజల్లో ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్’’ పథకం అనుభూతి కలగలేదని ఈ సర్వేలో వెల్లడయ్యింది.

ప్రభుత్వం ఒక సమయానికి డబ్బులు ఖాతాలో వేస్తే…. లబ్ధిదారుడికి గ్యాస్ వేరే సమయంలో బుక్ చేసుకోవచ్చు. దీంతో గ్యాస్ బుక్ చేయడానికి ముందే డబ్బులు వేయడం వల్ల సదరు డబ్బులను ఇతర అవసరాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఖాతాలో డబ్బులు వేయడం వల్ల 30 శాతం మైలేజీ వస్తే... ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే ఖాతాలో డబ్బులు జమ వేయడం వల్ల ఫలితం శూన్యం అని పీపుల్స్ పల్స్ పైలట్ సర్వేలో వెల్లడయింది.

టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ బుకింగ్ కన్న ముందే డబ్బులు వేసినా, ఉచితంగా గ్యాస్ పొందుతున్నామనే అనుభూతి ప్రజలకు కలగదు. ముందుగా ఖాతాలో పడిన డబ్బు ఇతర అవసరాలకు ఖర్చయిపోయి, వాస్తవంగా సిలెండర్ బుక్ చేయాల్సి వచ్చినపుడు సొంత డబ్బు చెల్లిస్తున్న భావనే ఉంటుంది.

లబ్దిదారులు ముందే కట్టిన సిలెండర్ గ్యాస్ డబ్బు 48 గంటల్లోపే తిరిగి చెల్లిస్తుంటే కూడా... మా సర్వేలో పాల్గన్న లబ్దిదారులు చాలామంది తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడం లేదు. అలా తెలుసుకోకపోవడం, డబ్బులు ఖాతాలో ఆలస్యంగా జమ కావడం వంటి అంశాలతో ప్రజల్లో పథకం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. అత్యధిక శాతం ప్రజలు ‘‘నేరుగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తేనే బాగుంటుంది’’ అనే అభిప్రాయం బలంగా వినిపించారు.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తే... గత వైఎస్ఆర్సిపి బాటలోనే కూటమి కూడా నడిచినట్లు అవుతుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

మార్పులు కావాలా…? లబ్ధిదారులు ఏం చెప్పారంటే..?

  • సర్వేలో పాల్గొన్న మహిళల్లో 70 శాతం మంది డెలివరీతో పాటు సబ్సిడీ జమ సమయం విషయంలో వేగం పెరగాలని కోరుకున్నారు.
  • ప్పటికే రెండు విడతల్లో ఉచిత గ్యాస్ అమలైన కొన్ని ప్రాంతాల్లో రీఫిల్ డెలివరీ ఆలస్యం, బ్యాంక్ లింకింగ్ సమస్యలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ టీం గుర్తించింది.
  • మొదటి విడతలో చాలామందికి సమయానికే డబ్బులు పడ్డాయి కానీ, రెండో విడతలో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 48 గంటలకు పడలేదని… చాలా ఆలస్యం అవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • ‘మీకు మూడు సిలిండర్లు సరిపోతున్నాయా?’ అని పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అడిగినప్పుడు 60 శాతం కుటుంబాలు మూడు సిలిండర్లు సరిపోతున్నాయని చెప్పగా… 40 శాతం మంది పెద్ద కుటుంబాలకు మూడు సిలిండర్లు సరిపోవని అభిప్రాయపడ్డారు.
  • ఉచిత గ్యాస్ పథకం వల్ల మీకు ఎంత ఆదా అయ్యింది? అని అడిగినప్పుడు లబ్ధిదారులు 80 శాతం మంది ఆదా అవుతోందని చెప్పారు. ఇలా ఆదా అయిన డబ్బును వేరే అవసరాలకు వాడుకుంటున్నాం అని చెప్పారు.
  • ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించడానికి 1967 టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నెంబర్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ఈ నెంబర్ గురించి అడిగినప్పుడు అసలు అది ఉందని తమకు తెలియదనే విషయాన్ని చెప్పినట్లు సర్వేలో గుర్తించారు.
  • ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం నడుపుతున్న వెబ్ సైట్ కూడా సరిగ్గా పని చేయడం లేదని అత్యధికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సలహాలు- సూచనలు:

ఉచిత గ్యాస్ సిలిండ్ (దీపం-2) పథకాన్ని మెరుగుపరచడానికి పీపుల్స్ పల్స్ సర్వే కొన్ని సూచనలు చేసింది.

  • ప్రజల్లో స్పష్టంగా ‘‘ఉచిత గ్యాస్’’ పొందుతున్న అనుభూతి కలిగించాలి. లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ‘జీరో బిల్లు’ ద్వారా నేరుగా ఉచితంగానే సిలిండర్ అందించే విధానాన్ని అమలు చేయాలి. ఇది ప్రభుత్వ హామీ అమలుని ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించేలా చేస్తుంది.
  • ప్రతి నెలా ఉచిత గ్యాస్ పథకం అమలు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అధికారులతో సమీక్షించాలి.
  • లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, సమస్యలను త్వరగా పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఈ పథకం అమలులో ప్రత్యక్షంగా పాల్గనాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో పథకం వివరాలు, నెరవేరే ప్రయోజనాలు వంటి విషయాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళా సంఘాలు, గ్రామ సచివాలయాల ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఇంటింటికీ ఫ్రీ గ్యాస్ కు సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలి.
  • మండల/గ్రామ స్థాయిలో అదనపు డిపోలు ఏర్పాటు చేసి, రీఫిల్ బుకింగ్-డెలివరీ మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. దీపం-2 అధిక కనెక్షన్లున్న చోట డెలివరీ బృందాల సంఖ్యను పెంచాలి.
  • ఉచిత గ్యాస్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలను, వారు పొందుతున్న ప్రయోజనాలు తెలిసివచ్చేలాగా మీడియా, సోషల్ మీడియా, గ్రామ సభల ద్వారా బయటి ప్రపంచానికి చూపించాలి.
  • ఒకవేళ పాత విధనాన్నే అమలు చేస్తే బ్యాంక్ లింకింగ్, ఈ-కేవైసీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్, మొబైల్ అప్లికేషన్, వన్-స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
  • పెద్ద కుటుంబాలకు అదనపు సిలిండర్ లేదా అదనపు సబ్సిడీ డిమాండ్ ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, మూడు సిలిండర్లు కాకుండా, కనీసం ఒక్క సిలిండర్ బయట కొనుక్కున్నా సదరు కుటుంబాల వారికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ భావన కలగడం లేదు.
  • దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు తక్కువ వ్యవధిలోనే ఉండటం వల్ల నవంబర్ రౌండ్ లో ఇచ్చే సిలిండర్ త్వరగా అయిపోతున్నట్లు సర్వేలో తేలింది.
  • IVRS మెసేజ్‌ల ద్వారా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న లబ్ధిదారులకు తరచూ ఈ పథకం గురించి సంక్షిప్త సందేశాలు పంపాలి.
  • సెలబ్రెటీలను (సినితారలు, క్రీడాకారులు) ఈ పథకం ప్రచారం కోసం ప్రభుత్వం వినియోగించుకోవాలి. ల్స్‌, షార్ట్స్‌, వాట్సప్‌ ద్వారా ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.
  • గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఉచిత గ్యాస్ గురించి ప్రచారం చేయాలి.

( Disclaimer : ఈ కథనంలోని అభిప్రాయాలు హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు సంబంధం లేదు. పీపుల్స్ పల్స్ సర్వేలో తేలిన అభిప్రాయాలుగా గమనించగలరు.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.