పహల్గామ్ ఉగ్రదాడికి భారత్...పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన పవన్ కల్యాణ్... ప్రతి భారతీయుడు హర్షించదగ్గ సందర్భం అన్నారు. ఈ దాడిలో జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. మొత్తం మీద 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారని చెప్పారు.
"పాకిస్తాన్లో 4 చోట్ల, పీవోకేలో 5 చోట్ల మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో భారత వాయుసేన మిస్సైళ్ల వర్షం కురిపించింది. మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసింది. పాకిస్థాన్కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చాం" - పవన్ కల్యాణ్
భారత్పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అందరూ దేశానికి అండగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు. సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో సోషల్ మీడియాలో జాగ్రత్తగా మాట్లాడాలంటూ సూచించారు.
'పాక్ కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టి చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారు. కొందరు పాక్కు అనుకూలంగా మాట్లాడారు. వారిని ఉద్దేశించే గతంలో నేను మాట్లాడాను. తీవ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాల్సిన సమయం వచ్చింది. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడవద్దు. భారత్ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కేంద్రానికి మద్దతుగా నిలవాలి'- పవన్ కల్యాణ్
"దశాబ్దాలుగా మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి "ఆపరేషన్ సిందూర్" తో తిరిగి వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారు.ఉగ్రవాదులు హిందువులా కాదా అని అడిగి మరి చంపారు. హిందువులపై దశాబ్దాలుగా దాడులు జరుగుతున్నాయి. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం చేస్తున్నాం"- పవన్ కల్యాణ్
సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్స్ ఎవరైనా దేశాన్ని కించపరిచేలా మాట్లాడితే కేసులు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదని చెప్పారు. ఇలాంటి సమయంలో అందరూ దేశం కోసం ఆలోచించాలి, పార్టీల కోసం కాదన్నారు. పాకిస్థాన్ కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని పవన్ కల్యాణ్ హితవుపలికారు.
ఏపీలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉందన్నారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ చేసుకుంటే మంచిదన్నారు. గాంధీ మార్గం అని చెప్పి సహనం సహనమని చేతులు కట్టేశారని, హిందువులను చంపితే భరించాలా? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
సంబంధిత కథనం