ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... ‘మన ఊరు- మాటామంతీ’ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు...సరాసరి కలిసేందుకు సమయం కుదరని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. ఒక ఊరితో ఒకరోజు మాట్లాడేలా ఈ కార్యక్రమాన్ని రూపొదించారు.
గ్రామస్థులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి....వారి సమస్యలకు దాదాపు అక్కడే పరిష్కారం చూపేలా పవన్ ఆదేశాలు ఇవ్వనున్నారు.
రేపు మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలసలో 'మన ఊరి కోసం మాటామంతీ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ పాల్గొంటారు.
టెక్కలి రావివలసలో స్క్రీన్ ఏర్పాటు చేసి గ్రామస్థులతో పవన్ కల్యాణ్ మాట్లాడాలని ముందుగా అనుకున్నారు. వాతావరణం సహకరించకపోవడంతో టెక్కలి భవానీ థియేటర్కు వేదిక మార్చారు.
రేపు రావివలస గ్రామస్థులతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
గ్రామంలో ముఖ్య సమస్యలపై పవన్ కల్యాణ్ ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
"ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ‘మన ఊరు - మాటా మంతీ' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేపు టెక్కలి నియోజకవర్గంలోని భవానీ థియేటర్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు.
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తూ..మన ఊరు - మాటా మంతీ' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు" -మంత్రి అచ్చెన్నాయుడు
సంబంధిత కథనం