Janasena Symbol Issue : గాజు గ్లాసు గుర్తును కోల్పోయిన జనసేన, ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఈసీ!
Janasena Symbol Issue : జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు పార్టీ సింబల్ గా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.
Janasena Symbol Issue : ఏపీ రాజకీయాల్లో జనసేక కీలకంగా మారుతున్న తరుణంలో ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చించిద. దీంతో జనసేన కార్యకర్తలు ఒకింత ఆందోళనలో ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు సింబల్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ విముక్త ఏపీ అంటూ టీడీపీతో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్ కు కేంద్రం ఈసీ రూపంలో ఝలక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తానంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాక్ ఇచ్చింది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల వివరాలను ఈసీ తాజాగా ప్రకటించింది. ఇందులో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే.... నిబంధనల ప్రకారం తగిన ఓట్ల శాతం తెచ్చుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు పోటీ చేసిన స్థానాలు, ఓట్లు, రాకపోవడంతో నిబంధనల ప్రకారం కామన్ సింబల్ దక్కలేదని చెబుతున్నారు. ఈ కారణంగానే జనసేన గాజు గ్లాసు గుర్తును కోల్పోయిందని భావిస్తున్నారు.
గాజు గ్లాసు గుర్తు పోతే జనసేనకు నష్టమే
రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. ఒకవేళ ఓడిపోయినా తగినంత శాతం ఓట్లు కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ లేదా జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు లభిస్తుంది. అయితే జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. తగినన్ని ఓట్లు, సీట్లు రాకపోతే ఆ పార్టీ సింబల్ ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబర్ కేటగిరీలో చేర్చుతుంది. జనసేన విషయంలో ఇలాగే జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. తిరుపతి లోకసభ ఉపఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది ఈసీ. అయితే వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయించకపోతే...భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాసు సింబల్ జనసేన పార్టీదని భావించి వారికి ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు. బద్వేల్ ఉప ఎన్నిక సమయంలోనూ గాజు గ్లాస్ సింబల్ ను స్వతంత్ర అభ్యర్థికి ఈసీ కేటాయించింది. గాజు గ్లాస్ గుర్తును కొనసాగించాలని జనసేన ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.