శ్రీసత్యసాయి జిల్లాలో రేపు జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర నేతలు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వీడియో కాల్లో మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. కల్లితండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా పోలీసులు.
మురళీనాయక్కు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు నివాళులు అర్పించారు. మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికీ స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 13న జగన్ కల్లి తండాకు వెళ్లి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.
దేశ సరిహద్దులో మురళీ నాయక్ అశువులు బాశడంతో.. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది. ఉగ్రవాదంపై మన దేశం సాగిస్తున్న పోరుబాటలో వీర జవాన్ సేవలు అందిస్తూ.. అనంత లోకాలకు వెళ్లడంతో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా కల్లితండా విషాదంలో మునిగిపోయింది. విషయం తెలియగానే సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఘటనపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు.
మురళీనాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రత్న తండాకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు లేదంటే బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో మృతదేహం తండాకు చేరుకుంటుందని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మురళీనాయక్ అనంతనగరం వాణి డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. ఆ కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు సంతాపం ప్రకటించారు.
సంబంధిత కథనం