Dasapalla Lands Issue : దసపల్లా భూములు కాపాడాలని విపక్షాల ఆందోళన
Dasapalla Lands Issue విశాఖపట్నంలోని దసపల్లా భూముల్ని కాపాడాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంగా ప్రతిపక్షాలు దసపల్లా భూముల వ్యవహారంలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దసపల్లా భూముల్ని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పావులు కదుపుతున్నారని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Dasapalla Lands Issue విశాఖపట్నం దసపల్లా భూముల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి బినామీ లకు వేలకోట్ల దసపల్లా భూముల బదిలీ చేస్తున్నారని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
విజయ సాయి కూతురు నేహా రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి అకౌంట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయల నిధుల బదిలీ చేశారని, ఉమేష్, గోపీనాథ్ రెడ్డి లను ముందు పెట్టి విజయసాయిరెడ్డి కథ నడుపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే దసపల్లా భూముల వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రమేయం అడుగడుగునా కనిపిస్తోందని జనసేన ఆరోపిస్తోంది.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రెండు నెలల క్రితం వరకు ఉత్తరాంద్ర జిల్లాల ఇన్చార్జి గా విశాఖ కేంద్రంగా పనిచేసిన విజయసాయిరెడ్డి దసపల భూముల కుంభకోణం లో కీలక పాత్ర వహించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో 62 మంది పేరిట రిజిస్ట్రర్ అయినా ఈ భూములను రిటైర్డ్ అధికారి ఉమేష్, వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డి ల పేరిట ఒక ఎల్ ఎల్ పి కంపెనీ ని క్రియేట్ చేసి దానితో డెవలప్మెంట్ ఎగ్రిమెంట్ చేయించారని, ఈ కంపెనీ 2020లో ప్రారంభం కావటం , వెంటనే డెవలప్మెంట్ ఎగ్రిమెంట్ జరగడం, తరువాత ఈ భూములను ప్రైవేటు పరం చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వుల వెలువడటం వెంటవెంటనే జరిగిపోయాయని చెబుతున్నారు.
వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూ కుంభకోణం లో కొంతమంది అధికార పార్టీ నాయకుల ప్రమేయం అడుగడుగునా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంగుళం ప్రభుత్వ భూమి కబ్జా కావటాన్ని సహించేది లేదని చెప్పిన విజయసాయిరెడ్డి అందుకు విరుద్ధంగా తన కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి తో దస్పల్ల భూములకు ఒప్పందం చేసుకున్న కంపెనీకి 9 కోట్ల రూపాయల నగదు బదిలీ చేయించారని ఆరోపించారు. స్వయంగా వారి అకౌంట్ నుంచి నగదు వెళ్లడం కుంభకోణంలో పార్టీ పెద్దల ప్రమేయాన్ని స్పష్టం చేస్తుందని చెబుతున్నారు.
విజయసాయి బినామీగా ఏర్పాటైన అష్యుర్ ఎస్టేట్స్ ఎల్ ఎల్ పి కంపెనీ కి విజయసాయి కుమార్తె అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అవియాన్ రియల్టర్ ఎల్ ఎల్ పీ కంపెనీ నుంచి ఈ నగదు అధికారికంగానే బదిలీ అయిందని చెబుతున్నారు. ఇందుకు వైజాగ్ కోస్ట్ రిసార్ట్స్ ఎల్ ఎల్ పీ ని వాడారు. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే దస్పల్ల భూములను అధికార బలంతో హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా దస్పల్ల భూములను పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి అందుకు విరుద్ధంగా భూకబ్జా కు పాల్పడడం దారుణమని ఆరోపించారు..
జుడిషియల్ మరియు రెవెన్యూ కుంభకోణం గా పేరుపడ్డ దస్పల్ల కుంభకోణాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సూట్ కేస్ కంపెనీల నుంచి కోట్ల రూపాయల బదిలీ జరిగినందున ఈ లావాదేవీల పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల లావాదేవీల లో అనుమానాలు, పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నందున నిషేధిత 22 ఏ జాబితా నుంచి ఈ భూముల తొలగించవద్దని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దసపల్లా భూముల వ్యవహారంలో టీడీపీ, సిపిఐలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దసపల్లా భూముల్ని కాపాడాలని డిమాండ్ చేశాయి.