SPA PG Admissions: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
SPA PG Admissions: విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

SPA PG Admissions: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన విజయవాడ స్పాలో పీజీ కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్కిటెక్చర్ విభాగంలో తొమ్మిది పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ (విజయవాడ) తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని క్యాంపస్ అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
జాతీయ విద్యా సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ (విజయవాడ)లో పీజీ ప్రవేశాలు జరుగుతున్నాయని, ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ప్లానింగ్ అండ్ ఆర్టిటెక్చర్ విభాగాలకు సంబంధించిన తొమ్మిది పీజీ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని, ఒక్కో పీజీ కోర్సులో 25 సీట్లు చొప్పున తొమ్మిది పీజీ కోర్సుల్లో మొత్తం 225 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలు కావాలనుకునేవారు యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ లింక్ https://www.spav.ac.in/spavadmissions.html ను సంప్రదించాలి.
పీజీలో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో (సస్టైనబుల్ ఆర్కిటెక్చర్), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్) (సెల్ఫ్-ఫైనాన్సింగ్ కోర్సు), మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ (సెల్ఫ్-ఫైనాన్సింగ్ కోర్సు), మాస్టర్ ఆఫ్ అర్బన్ డిజైన్ (ఎంయూడీ), మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్), మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్), మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్లానింగ్) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఈ లింకు ద్వారా విద్యార్ధులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. https://forms.gle/qn3FUEt8xzkxL5Ye7
ఏపీ ఈఏపీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్…
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి ఏపీఈఏపీసెట్-2024 అడ్మిషన్లలో భాగంగా రేపటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేయనున్నారు. జూలై 4 నుంచి జూలై 10 తేదీ వరకు సర్టిఫికేట్లు పరిశీలన చేస్తారు. అలాగే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ప్రాపెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జూలై 7లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
జూలై 8 నుండి జూలై 12 వరకు ఐదు రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఇవ్వల్సి ఉంటుంది. ఐచ్చికాల మార్పునకు జూలై 13 తేదీని తుది గడువుగా ప్రకటించింది. అయితే వెబ్ ఆప్షన్లు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 16న సీట్లు కేటాయింపు పూర్తి చేస్తారు. సీటు పొందిన విద్యార్థులు జూలై 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు ఆయా కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
జూలై 19 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీఈఏపీసెట్-2024 నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. బీ-ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)