NHRC : దళిత మహిళపై వేధింపులు…. డిజిపి నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ-nhrc orders dgp to probe maid s torture ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nhrc : దళిత మహిళపై వేధింపులు…. డిజిపి నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

NHRC : దళిత మహిళపై వేధింపులు…. డిజిపి నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

HT Telugu Desk HT Telugu

తప్పుడు కేసులో దళిత మహిళను ఇరికించి హింసించారనే ఆరోపణలపై ఐజీ స్థాయి అధికారితో దర్యాప్తు జరిపించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఏపీ డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. చిత్తూరుజిల్లా జైలు అధికారి ఇంట్లో పనిచేస్తోన్న మహిళను అకారణంగా హింసించారనే అభియోగాలపై కమిషన్ స్పందించింది.

ఏపీ డీజీపీ ఎన్‌హెచ్చార్సీ నోటీసులు

దళిత మహిళను అకారణంగా కేసులో ఇరికించి, తీవ్రంగా హింసించారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఫిర్యాదుతో స్పందించిన కమిషన్ నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఏపీ డిజిపిని ఆదేశించింది.   చిత్తూరు జిల్లా జైళ్ల శాఖ సూపరింటెండెంట్‌గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఉమామహేశ్వరి పనిచేసేది.  

ఆయన ఇంట్లో నగలు మాయం అవ్వడంతో పనిమనిషి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  జైళ్ల శాఖ అధికారి ఒత్తిడితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి హింసించారు. చేయని నేరాన్ని అంగీకరించాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జనవరిలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

చేయని నేరానికి పనిమనిషిని చిత్ర హింసలకు గురి చేసిన ఘటనలో పోలీసులతో పాటు జైళ్ల శాఖ అధికారిపై ఎన్‌హెచ్‌ఆర్సీకి  ఫిర్యాదులు అందడంతో కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ఐజీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించి నాలుగు వారాల్లో నివేదిక  సమర్పించాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని  దేశించింది. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన తర్వాత బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు తీవ్రంగా వేధించినట్లు అభిప్రాయపడింది.  బాధితులకు తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు గురైనట్లు ఉందని లేఖలో పేర్కొన్నారు.  చేయని నేరాన్ని అంగీకరించాలని ఉద్దేశపూర్వకంగానే ఒత్తిడి చేసినట్లు  పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.

రాష్ట్ర డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ హర్షం వ్యక్తం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  దళితులపై దాడులు పెరిగాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని  వేధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.