మెగా డీఎస్సీలో ఎంపికయిన ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10 వరకు శిక్షణ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. అకడమిక్ కేలండర్, హ్యాండ్బుక్ తదితర మెటీరియల్ అందిస్తారు. మరో విడత ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి.
అక్టోబర్ 13వ తేదీ నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరు అవుతారు. ఇంకోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అక్టోబర్ 25 వరకు తెలపవచ్చు అని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణా రెడ్డి చెప్పారు. దీనికోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. ఒకవేళ జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకుంటే.. రాష్ట్రస్థాయి కమిటీకి వెళ్లవచ్చు.
అంతేకాదు రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే.. తుది అప్పీలేట్ అథారిటీ అంటే పాఠశాల విద్య డైరెక్టర్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీలు 15 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కారిస్తాయని కృష్ణా రెడ్డి చెప్పారు. తుది అప్లీలేట్ అథారిటీ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుందన్నారు.
మరోవైపు పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పని చేస్తూ.. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు శిక్షణకు హాజరు అయ్యేందుకు ఆయా విభాగాలు సెలవులు మంజూరు చేయడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ నుంచే విధుల నుంచి రిలీవ్ చేస్తామని చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయింది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. తుది ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసింది.
16347 పోస్టులకు.. 15941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతీ ఏటా డీఎస్సీ ఉంటుందని, ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.