YCP to Janasena: వలస నేతలతో జనసేనలో కొత్త చిక్కులు..పార్టీలు మారిన నేతలపై గుర్రు-new troubles in jana sena with migrant leaders murmur against leaders who have changed parties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp To Janasena: వలస నేతలతో జనసేనలో కొత్త చిక్కులు..పార్టీలు మారిన నేతలపై గుర్రు

YCP to Janasena: వలస నేతలతో జనసేనలో కొత్త చిక్కులు..పార్టీలు మారిన నేతలపై గుర్రు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 13, 2025 10:57 AM IST

YCP to Janasena: ఉమ్మడి కృష్ణాలో ఆయన ఒక కీలక కాపు నేత. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నమ్మిన బంటు…వైయస్ కుటుంబానికి వీర విధేయుడు.. 2024 ఎన్నికల్లో ఓడిపోయారో లేదో…మరో ఆలోచన లేకుండా జనసేన పార్టీలో చేరిపోయారు. పార్టీలో చేరిన వెనువెంటనే ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా పదవిని కూడా కట్టబెట్టింది జనసేన అధిష్టానం.

ఉదయభాను తీరుపై జనసేన నాయకుల్లో అసంతృప్తి
ఉదయభాను తీరుపై జనసేన నాయకుల్లో అసంతృప్తి

YCP to Janasena: ఏపీలో వైసీపీ ఓటమి పాలైన వెంటనే అసంతృప్తి నేతలంతా తమ దారి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా నుంచి వైసీపీని వీడి జనసేననలో చేరిన సామినేని ఉదయభాను చేరిక ఆ పార్టీలో కొత్త చిక్కులు తెచ్చింది. ఒకపక్క జనసేనలో కొనసాగుతూనే ఇప్పటికీ గుండెల నిండా వైయస్ కుటుంబం పై ఎనలేని ప్రేమను కనపరుస్తున్నారని జనసేన నేతల్లో అక్రోశం వ్యక్తం అవుతోంది.

సామినేని ఉదయ భాను…NTR జిల్లా రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు‌ ఉండరు. జగ్గయ్యపేట పేట రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు…ప్రభుత్వ విప్ గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.. వైఎస్ కుటుంభానికి వీర విధేయుడీగా ముద్రవేసుకున్న ఉదయభాను వైఎస్ జగన్ అనుగ్రహాన్ని మాత్రం దక్కించుకోలేక పోయారు.

2019 ఎన్నికల్లో‌ జగ్గయ్యపేట నుండి గెలిచిన ఉదయ భాను మంత్రి కావడం పక్కా అని లెక్కలు వేసారు… కానీ ఆ లెక్క తప్పింది…దీంతో ఆయన కొన్ని రోజులు అలక పూనారు… ఇక మలివిడత క్యాబినెట్ విస్తరణలో తనకు‌బెర్త్ కన్ఫర్మ్ అని తెగ ప్రఛారం జరిగింది. కానీ‌ నాటి సీఎం వైఎస్ జగన్ మాత్రం ఉదయ భానుకి మొండి చెయ్యే చూపించారు.

దీంతో ఉదయభాను కొంత కాలం పార్టీకి ధిక్కార స్వరం వినిపించడం మొదలు పెట్టారు.‌ ఆయన బుజ్జగించడానికి నాటి వైసిపి సర్కార్ టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నికలకు సరిగ్గా ఏడు నెలల ముందు నియమించింది.

2024 ఎన్నికల్లో సామినేని ఉదయభాను పోటీకి దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. ఐపాక్ టీం వేసిన లెక్కల్లో అసలు సామినేని ఉదయభాను సీటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ ఆఖరి వరకు కొనసాగింది. ఒకానొక సందర్భంలో ఆయన కుమారుడికి తన సీటు ఇవ్వాలని కోరినట్టు వార్తలు వినిపించాయి. కానీ వాటి అన్నిటినీ పక్కనపెట్టి చివరికి ఉదయభాను పోటీకి దిగి టిడిపి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమితో మారిన మనసు…

ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటివారం నుండే సామినేని ఉదయభాను జనసేనలోకి జంప్ అయిపోతున్నారనే వార్తలు వినిపించాయి. మొదటిలో ఆయన వాటిని ఖండించిన ఆ తరువాత ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. అనూహ్యంగా ఓరోజు పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించేసారు. ఆ మరుసటి రోజే పార్టీ కండువా కూడా కప్పేస్తున్నారు.

పార్టీలో చేరిన వెంటనే ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించారు. వాస్తవానికి ఈ నిర్ణయం ఎప్పటి నుండో పని చేస్తున్న జనసేన నాయకులకు మింగుడు పడలేదు. కానీ బలమైన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎదురు చెప్పలేక కీలక నేతలు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టు ఉంటున్నారు.

జనసేనలోకి వచ్చిన ఉదయభానుతో ఆయన అనుచరులు పార్టీలోకి చేరింది కూడా పెద్దగా లేదు. ఒకప్పుడు ఆయనకు కుడి భుజంలా వ్యవహరించిన తన్నీరు నాగేశ్వరరావు వంటి నేతలు కూడా ఉదయభాను వెంట జనసేనలో చేరలేదు.

మరోవైపు సామినేని ఉదయభాను కూడా అయిష్టంగానే జనసేనలో కొనసాగుతున్నారు. ఇటీవల సామినేని ఉదయభాను ఇంట్లోని ఓ ఫోటో ఈ అనుమానాలకు ఊతమిస్తుంది. ఈ ఫోటోలో సామినేని ఉదయభాను ఓ కార్యకర్త జన్మదిన తన ఇంటి వద్ద జరిపిస్తున్నట్టు ఉంది. ఆ వెనుక ఓవైపు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఫోటో దర్శనమిచ్చింది.

జనసేన అధికార ఎన్డీఏ కూటమిలో కీలక పార్టీ. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రిగా తనకు కేటాయించిన శాఖలకు మాత్రమే పరిమితం కాకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతూ పరిపాలనపై పూర్తి పట్టు సాధిస్తున్నారు. కానీ ఆయన పార్టీలోని ఓ జిల్లాస్థాయి నేత మాత్రం ఇప్పటికీ ఆయన వదిలేసి వచ్చిన పార్టీ జ్ఞాపకాల్లోనే ఉండిపోవడం కొంత జనసేన కేడర్‌ను కూడా అయోమయానికి గురి చేస్తోంది.

జగ్గయ్యపేటలో ఎప్పటినుండో పనిచేస్తున్న స్థానిక జనసేన క్యాడర్‌ను ఉదయభాను కలుపుకొని వెళ్లడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. గతంలో చంద్రబాబు అరెస్టయిన రోజున పవన్ కళ్యాణ్‌ను ఏపీలోకి రాకుండా జగ్గయ్యపేట సమీపంలో అడ్డుకున్నప్పుడు, ఉదయభాను కు సంబంధించిన కొంతమంది కీలక అనుచరులు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని… వారంతా ఇప్పుడు జనసేన నాయకులుగా చలామణి అవుతున్నారని పార్టీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఉదయభానుతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరినా ఆ తర్వాత పెద్దగా పార్టీ కార్యకలాపాలు మాత్రం లేవని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.

Whats_app_banner