Nara Lokesh Yuvagalam: పాదయాత్ర నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు… యువగళంతో టీడీపీలో కొత్త ఉత్సాహం
Nara Lokesh Yuvagalam: వైసీపీ పాలనపై సమరశంఖం పూరించి, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తైంది. రాష్ట్రంలో 5కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27వతేదీన పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లారు.
Nara Lokesh Yuvagalam: అభద్రతాభావం, నిరాశ,నిస్పృహలతో కొట్టు మిట్టాడుతున్న టీడీపీ శ్రేణులకు నేనున్నానంటూ నారా లోకేష్ రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్రలో జనంలోకి వెళ్లారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే వరకు ఏకబిగిన కొనసాగింది. పండుగలు, సెలవులు లేకుండా ఏకబిగిన పాదయాత్రను కొనసాగించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ఓడించడంలో యువగళం కీలకపాత్ర పోషించింది.

ప్రతికూల వాతావరణంలోనూ అడుగు ముందుకే!
యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామ లేకుండా యువగళం పాదయాత్ర సాగింది.
రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం మంత్రి లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ఎండ, వాన, తుపానులను సైతం లెక్కచేయకుండా మంత్రి లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షాన్నిలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్కచేయలేదు.
యువగళం పాదయాత్రలో లోకేష్ 70 బహిరంగసభలు, 155ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. కుటుంబసభ్యుడిలా భావించి తమ బాధలు చెప్పుకుంటూ యువనేతకు జనం నీరాజనాలు పట్టారు. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మందికి ప్రజలను యువనేతతో కనెక్ట్ అయ్యారు.
కేసులకు వెరువకుండా…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ ప్రచారరథం మొదలుకుని నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర తంబళ్లనియోజకవర్గం చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 25కేసులు నమోదయ్యాయి. ఇందులో లోకేష్ పై 3కేసులు నమోదు చేశారు.
ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని కేసులు బనాయించినా యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగాయి. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పసుపు సైనికులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో యువగళం వాలంటీర్లపై కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితోసహా 46మంది కీలకనాయకులపై కేసులు నమోదు చేశారు.
రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారు. 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కి.మీ మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది.
ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జేజేలు
ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23రోజులపాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8నియోజకవర్గాలు, 11రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 12రోజులు 178.5 కి.మీ.లు కలిపి మొత్తం 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది.
హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు
సుదీర్ఘ యువగళం పాదయాత్రలో యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా సీమ ప్రజల కోసం కడపలో మిషన్ రాయలసీమపేరుతో డిక్లరేషన్ ను ప్రకటించారు. యువనేత లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రతిబింబిస్తూ ఎన్ డిఎ కూటమి సూపర్ సిక్స్ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించింది. పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సంబంధిత కథనం