AP Electricity Charges: కొత్తగా యూనిట్‌‌కు రూ.1.22పైసల భారం.. విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలపై ఆందోళన-new burden of rs 1 22 paise per unit concern over electricity adjustment charges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Electricity Charges: కొత్తగా యూనిట్‌‌కు రూ.1.22పైసల భారం.. విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలపై ఆందోళన

AP Electricity Charges: కొత్తగా యూనిట్‌‌కు రూ.1.22పైసల భారం.. విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలపై ఆందోళన

Bolleddu Sarath Chandra HT Telugu
Published Oct 31, 2024 01:00 PM IST

AP Electricity Charges: నవంబరు 1 నుండి విద్యుత్ బిల్లులలో కలిపి వసూలు చేయతలపెట్టిన రూ. 6,072.86 కోట్ల సర్దుబాటు చార్జీలను విద్యుత్ వినియోగదారుల మీద విధించకుండా, రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని,దానికోసం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేటాయించాలని విద్యుత్‌ వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏపీలో నవంబర్ 1 నుంచి విద్యుత్ ఛార్జీల భారంపై ఆందోళన
ఏపీలో నవంబర్ 1 నుంచి విద్యుత్ ఛార్జీల భారంపై ఆందోళన

AP Electricity Charges: ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు పై విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలోని వివిధ అపార్ట్ మెంట్ అసోసియేషన్లు, వర్తక వాణిజ్య సంఘాలు, చిన్న పరిశ్రమలు, ట్రేడ్ యూనియన్లు కు చెందిన ప్రతినిధులు, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు.

ప్రస్తుతం రూ. 6072.86 కోట్ల సర్దుబాటు ఛార్జీలతో పాటు మరో రు.11,826 కోట్లు వసూలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీపీఎం నాయకుడు బాబురావు ఆరోపించారు. సర్దుబాటు చార్జీలు విధిస్తే గృహావసరాలకు వాడే విద్యుత్‌కు మాత్రమే కాకుండా విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించే చేతి వృత్తుల వారిపై, వర్తక వాణిజ్య సంస్థలు, చిన్న పరిశ్రమలపై విద్యుత్ చార్జీల భారం అధికంగా పడుతుందని అన్నారు.

ఇప్పటికే వినియోగదారులపై భారం…

  • 2014-2019 మధ్యకాలానికి సంబంధించి న రు.3016 కోట్లు ట్రూఅప్ చార్జీల పేరుతో యూనిట్‌కు 0.22 పైసలు చొప్పున గత 27 నెలల నుండి వసూలు చేస్తున్నారని, ఇంకొక 9 నెలలు అంటే జులై 2025 వరకు వీటిని వసూలు చేస్తారన్నారు.
  • ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో 2021-2022 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి యూనిట్‌కు 0.66 పైసలు చొప్పున, 2022-2023 ఆర్ధిక సంవత్సరంనుండి ప్రతినెల అంతకు ముందు నెలలోవాడిన విద్యుత్‌కు యూనిట్‌కు 0.40 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారనిటాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి యం.వి. ఆంజనేయులు వివరించారు.
  • ప్రస్తుత రు. 6,072 కోట్లను 15 నెలలపాటు వసూలు చేయతలపెట్టారని, దీని వల్ల యూనిట్ కు సగటున 1.32 పైసలు ఛార్జీ పడే అవకాశముందని అన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ వ్యాపారాలు తగ్గిపోయి, పనులు తగ్గిపోయిన సమయంలో ఈ విద్యుత్ చార్జీలు భారంగా మారే పరిస్థితి ఏర్పడిందని, దీనివలన సరుకులు, సేవల ధరలుకూడా విపరీతంగా పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు.
  • ఫిక్సిడ్ ఛార్జీల భారం…

వీటికి తోడు ఫిక్స్డ్ చార్జీల పేరుతో కిలోవాట్‌కు నెలకు రూ. 10లు, కస్టమర్ చార్జీలపేరుతో రూ.25 నుండి రూ.55, విద్యుత్ సుంకం పేరుతో యూనిట్కు 0.6 పైసలు (షాపులకు, పరిశ్రమలకు అయితే యూనిట్‌కు 1 రూపాయి) చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. వీటన్నిటితో ఇప్పటికే విద్యుత్ వినియోగదారులపై విపరీతమైన భారం పడిందని, అందువలన ఈ సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి తప్ప విద్యుత్ వినియోగదారుల నుండి వసూలు చేయరాదని డిమాండు చేశారు.

టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి యం.వి. ఆంజనేయులు కన్వీనర్‌గా " విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక" ఏర్పడింది. ప్రస్తుత సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై మోపరాదని, రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, దానికి వీలుగా రాబోయే బడ్జెట్లో కేటాయింపులు జరపాలని స్మార్ట్ మీటర్లు బిగించాలన్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రిగారికి, విద్యుత్ సి. యం.డికి వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానించింది.

Whats_app_banner