నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య(50) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
బుచ్చిరెడ్డి పాలెంలో తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. మృతులను అభిషేక్ రాజ్ (అనంతపురం), నరేష్ నాయక్ (అనంతపురం), జీవన్ చంద్రారెడ్డి (నెల్లూరు), యజ్ఞేశ్ (ప్రకాశం), అభిశశి పురుషోత్తం( తిరుపతి)గా తెలుస్తోంది.
మరో వైద్య విద్యార్థి నవనీత్ శంకర్ (కడప) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో కారు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు వైద్య విద్యార్థులు, మరో వ్యక్తి మరణించడం తీవ్ర బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పోతిరెడ్డిపాలెం కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు, మరొకరు మృతి చెందడంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని జగన్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సంబంధిత కథనం