Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం, అశ్లీల చిత్రాలు తీసి వేధించిన యువకుడు- బాలిక ఆత్మహత్యాయత్నం!
Nellore Crime : నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో పదో తరగతి బాలిక వెంటపడి లోబర్చుకున్నాడో యువకుడు. ఆపై బాలిక అశ్లీల చిత్రాలు తీసి వేధించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.
నెల్లూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకుని, ఆపై బాలిక అశ్లీల చిత్రాలు తీసి వేధించడంతో పాటు, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే ఈ ఘటనలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపిస్తుంది.
ఈ ఘోరమైన ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం లింగంగుంటకు చెందిన హుస్సేన్ వివాహితుడు. అనంతసాగరంలో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను రెండేళ్ల నుంచి మాయమాటలతో మభ్యపెట్టాడు. ప్రేమ పేరుతో ఆమె వెంటపడి వేధించాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెను లోబరచుకున్నాడు.
బాలిక పదో తరగతి పూర్తి కాగానే ఇంటర్మీడియట్ చదువు కోసం గూడురులో చేరింది. అప్పటి నుంచి అశ్లీల చిత్రాలు చూపిస్తూ తాను చెప్పినట్లు వినాలని వేధించడంతో ఆమె మనోవేదనకు గురైంది. దీంతో వేధింపులు తాళలేక ఇంటర్మీడియట్ చదువును ఆత్మకూరు కాలేజీ మార్చింది. అప్పుడైనా ఆ యువకుడి వేధింపులు ఆగుతాయని భావించింది. కానీ ఆ వేధింపులు అలానే సాగాయి.
అయితే ఆ యువకుడికి వివాహమైన విషయం బాలికకు తెలియడంతో అతడిని నిలిదీసింది. పెళ్లి కాలేదన్నావు, నీకు పెళ్లి అయింది, నన్ను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించింది. దీంతో ఆ బాలికకు వేధింపులు మరింత పెరిగాయి. కక్షకట్టిన హుస్సేన్ నిత్యం బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులను పట్టించుకోకపోవడంతో బాలిక చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్కు అశ్లీల చిత్రాలను పంపాడు. ఈ అశ్లీల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే కాలేజీకి చెడ్డపేరు వస్తుందని కాలేజీ ప్రిన్సిపల్, బాలిక తల్లిదండ్రులను పిలిపించి బాలికకు టీసీ ఇచ్చి పంపించేశారు.
అయినప్పటికీ హుస్సేన్ కక్షతోనే మళ్లీ అశ్లీల చిత్రాలను వైరల్ చేశాడు. దీంతో బాలిక అశ్లీల చిత్రాలు వైరల్ కావడంతో బాలిక కుటుంబ సభ్యులతో కొందరు అవమానకరంగా మాట్లాడారు. దీనిపై అనంతసాగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మనోవేదినకు గురైన బాలిక శనివారం ఇంట్లో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అపస్మారక పరిస్థితిల్లో పడిపోయిన ఆ బాలికను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మకూరు సీఐ గంగాధర్ మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో చట్టం, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం