రాయలసీమలో మరో కీలక ప్రాజెక్టుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ సంస్థ తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో వచ్చే ఆరేళ్ళ లో వివిధ దశల్లో రూ.5,001 కోట్ల వ్యయంతో తమ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది.
2024 సెప్టెంబర్ లో జపాన్ నుండి వచ్చిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు, రాయలసీమ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేస్తున్న కృషి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకుంటున్న చర్యల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రంలో తమ యూనిట్ నెలకొల్పేందుకు ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చింది. ఫ్రిజ్ లు , వాషింగ్ మెషిన్లు, ఏసీలు తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఎపిలో కొత్తగా ఏర్పాటుచేసే యూనిట్ లో తయారవుతాయి.
ఎల్జీ సంస్థ తమ ఉత్పత్తులకు అవసరమైన విడి భాగాలను వేరే దేశాల నుండి తీసుకురావడం కాకుండా ఇక్కడే కంప్రెసర్, మోటార్ కంప్రెసర్, హీట్ ఎక్స్ చేంజర్ భాగాలను ఆంధ్రప్రదేశ్ లోనే తయారు చేయనుంది. శ్రీసిటీలో ఏర్పాటుచేసే యూనిట్, అనుబంధ కంపెనీల ద్వారా రాబోయే ఆరేళ్లలో యువతకు 2వేల ఉద్యోగాలు లభిస్తాయి. రూ.839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు ఆరేళ్లలో ఏర్పాటు కాబోతున్నాయి.
రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన యువత స్థానికంగా ఉద్యోగాల్లేక పొరుగు రాష్ట్రాలకు వలసబాట పట్టిన పరిస్థితులను యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన లోకేష్... అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించి, వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగానే గాక కీలకమైన ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కేవలం 5 నెలల్లోనే శ్రీసిటీలో ఎల్ జి యూనిట్ ఏర్పాటు అవసరమైన అన్ని అనుమతులు, రాయితీలు ఇచ్చి కంపెనీ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు.
రాష్ట్రంలో గత అయిదేళ్ల విధ్వంసక పాలనలో పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్దరించి వారిని రప్పించేందుకు మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. గత 11నెలల్లో 8లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాలు కల్పించేలా వివిధ కంపెనీలు ఎపి ప్రభుత్వంతో ఎంఓయులు చేయడంలో కీలకపాత్ర వహించారు.
లోకేష్ చొరవతో ఆర్సెలర్ మిట్టల్, BPCL, TCS, NTPC, టాటా పవర్, రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ వంటి ప్రధాన సంస్థలు పెద్దఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇటీవల కృష్ణాజిల్లా మల్లవల్లిలో హిందూజా గ్రూప్ అశోక్ లేలాండ్ వాహనాల తయారీ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించింది.
గతనెలలో ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సిబిసి ప్లాంట్ కు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. రాష్ట్రంలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ రూ.65వేల కోట్ల విలువైన 500 యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేసేందుకు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును బలోపేతం చేశారు.
అమెరికా, దావోస్ పర్యటనల సందర్భంగా వందలాది పారిశ్రామికవేత్తలకు కలిసిన మంత్రి లోకేష్... రాష్ట్రంలో అనుకూలతలను వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.
సంబంధిత కథనం