Naralokesh: యువగళం పాదయాత్రకు బ్రేక్.. మహానాడులో పాల్గొననున్న లోకేష్
Naralokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చారు. రాజమహేంద్రవరంలో జరుగనున్న మహానాడులో పాల్గొనేందుకు నాలుగు రోజుల పాటు యువగళం యాత్రకు విరామం ఇచ్చారు.
Naralokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 110వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు లోకేష్్ మొత్తం 1423.7 కి.మీ. పాదయాత్రను పూర్తి చేశారు. గురువారం 12.3 కి.మీల పాదయాత్రను పూర్తి చేశారు. మహానాడు సందర్భంగా మే 26వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు పాదయాత్రకు విరామాన్ని ప్రకటించారు. 30వ తేదీన జమ్మలమడుగు బైపాస్ రోడ్డు క్యాంప్ సైట్ నుంచి 111వరోజు పాదయాత్ర ప్రారంభం కానుంది.
ట్రెండింగ్ వార్తలు
యువగళం పాదయాత్ర 110వరోజు కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుకు సాగింది. అడుగడుగునా ప్రజలు లోకేష్కు ఎదురేగి స్వాగతం పలికారు. జమ్మలమడుగులో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.
ఎన్.కొత్తపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. పెద్దపసుపుల మీదుగా జమ్మలమడుగు బైపాస్ రోడ్డు వద్ద క్యాంప్ సైట్ కు చేరుకుంది. పెద్ద పసుపులలో జనం రోడ్లవెంట బారులు తీరడమేగాక, భవనాలపై నిలబడి యువనేతకు అభివాదం చేశారు.
పెద్దపసుపుల దళితవాడలో అక్కడి ప్రజలను కలిసి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. పాదయాత్ర దారిలో వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, ముస్లింలు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు.
110వరోజున యువనేత లోకేష్ 12.3 కి.మీలు నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1423.7 కి.మీ.లు పూర్తయింది. మహానాడును పురస్కరించుకొని ఈనెల 26నుంచి 29వతేదీవరకు 4రోజులపాటు యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈనెల 30వతేదీన జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి 111వరోజు పాదయాత్ర ప్రారంభిస్తారు.
జమ్మలముడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని లోకేష్ ఆరోపించారు. మైనారిటీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు యథేచ్చగా అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు.
నర్సరావుపేటలో మసీదు స్థలం కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారని, పేద ముస్లింల వివాహానికి కానుకగా ఇచ్చే దుల్హాన్ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో పూర్తిగా నీరుగార్చారన్నారు. దుల్హాన్ పథకం కింద టిడిపి హయాంలో 32,722 మందికి 163.61 కోట్లు అందజేస్తే, వైసిపి ప్రభుత్వం ఊరికి ఒకరిద్దరికి కూడా పథకాన్ని ఇవ్వలేదన్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకంలో వైసీపీ పెట్టిన షరతులన్నీ తొలగిస్తాం, అర్హులందరికీ పథకం అమలు చేస్తామన్నారు. గతంలో మైనారిటీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి మైనారిటీల స్వావలంబనకు కృషిచేస్తామన్నారు. జమ్మలమడుగు మైనారిటీలకు కమ్యూనిటీ హాలు, ఉర్దూ పాఠశాల, ప్రత్యేక శ్మశానవాటిక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న బీడీ కార్మికులందరికీ ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు.
జమ్మలమడుగు నియోకవర్గం పెద్దపసుపుల జంక్షన్ లో పెద్దముడియం గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామం నుండి సుద్దపల్లెకు, పొలాలకు వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మించాలి. జంగాలపల్లె వెళ్లే రహదారి వద్దనున్న వంకపై బ్రిడ్జి కుందూనది వరద వస్తే మునిగిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కుందూనది వరద వల్ల మా భూములు కోతకు గురవుతున్నాయి. రాజోలి ప్రాజెక్టు నిర్మించి మా భూములకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. పెద్దముడియం గ్రామంలో జూనియర్ కాలేజీ, కళ్యాణమండపం నిర్మించాలని, గ్రామ ముస్లిములకు షాదీఖానా ఏర్పాటు చేయాలని కోరారు.