Nara Lokesh Padaytra: జగన్ వినాశక చర్యలకు ఇదే సాక్ష్యమన్న లోకేశ్
Lokesh Yuvagalam Padaytra Updates:నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన... సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలను సంధించారు.
Nara Lokesh Latest News: ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్షసాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అన్నారు. గురువారం యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించారు. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారని లోకేశ్ గుర్తు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
గత ప్రభుత్వంలో ఇందుకోసం 623 ఎకరాల భూమి కూడా కేటాయించారన్నారని చెప్పారు. అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జైన్ ప్రాజెక్టు నిలచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైకో సీఎం వికృత పాలనకు ఇదొక ఉదాహరణ మాత్రమేనని లోకేశ్ దుయ్యబట్టారు. ఇక లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 96 రోజులకు చేరింది. నందికొట్కూరు నియోజకవర్గంలోని అల్లూరు వద్ద 1200 కిలోమీటర్ల మైలురాయికి చేరింది.
సర్కార్ విఫలం - చంద్రబాబు
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన రేపు పెను ఉప్పెన అవుతుందని.. అందులో వైసీపీ కొట్టుకుపోతుందన్నారు. నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ఆయన నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడం లేదు? రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలేంటి? అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడ? దెబ్బతిన్న పంట ఎంత..కొన్న ధాన్యం ఎంత? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకునేందుకు రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్ ఇప్పుడు ఎక్కడున్నారు? 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా ఈ సీఎం ఎందుకు వెళ్లలేదు?’’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులకు వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం