Nijam Gelavali: నారా భువనేశ్వరి నేటి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం ద్వారా టీడీపీ శ్రేణుల్ని యాక్టివేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించనున్నారు.
46 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలుపనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు.
తొలిరోజైన బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.
పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు. గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీకాళ హస్తిలో పలు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.
నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తిరుపతి వచ్చిన భువనేశ్వరి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 10 గంటలకు శ్రీవారి దర్శనం అనంతరం నేరుగా నారావారిపల్లికి వెళ్లారు. నారావారిపల్లెలో గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు.
అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా నారావారిపల్లి గ్రామస్తులు భువనేశ్వరిని కలిసి సంఘీభాతం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తమను ఎంతో బాధించిందన్నారు. రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి సూచించారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులు, భర్త చంద్రబాబు నాయుడుతో కలిసి నారావారిపల్లెకు వచ్చే భువనేశ్వరి ఈసారి ఒంటరిగా గ్రామానికి రావడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
భర్త చంద్రబాబు నాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని, ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే తాను ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళానని, ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించిందని భువనేశ్వరి ట్వీట్ చేశారు. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నానని ట్వీట్ చేశారు.