Vijayasai Reddy Cell Phone : విజయసాయి రెడ్డి ఫోన్ పోయిందా? లేకుంటే..?
Vijayasai Reddy Cell Phone Missing : ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫోన్ పోయిందని ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది. అయితే అది కాదు.. వేరే విషయం ఉందని మరోవైపు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగింది?
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫోన్(Vijayasai Reddy Phone) విషయం ఏపీలో పెద్ద ఎత్తున చర్చకు లేచింది. ఈ అంశాన్ని టీడీపీ(TDP) నేతలు అస్సలు వదలట్లేదు. ఫోన్ పోవడం ఏదీ లేదని అంటున్నారు. కావాలనే పడేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆయన ఫోన్ పోయినట్టుగా మాత్రం పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ వెళ్లింది.
ట్రెండింగ్ వార్తలు
విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందని ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసు(Tadepalli Police)లకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న ఐఫోన్(Iphone) పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఎక్కడ మిస్ అయ్యింది, విజయసాయిరెడ్డి ఎప్పుడు రియలైజ్ అయ్యారు అనే విషయాలపై టీడీపీ ప్రశ్నిస్తోంది. యాపిల్(Apple) కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రొ సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కీలక సమాచారం ఉందని చర్చ నడుస్తోంది.
అయితే రెండు రోజులుగా సాయిరెడ్డి తాడేపల్లిలో ఉన్నారనే సమాచారంపై ఎలాంటి స్పష్టత లేదని కొంతమంది అంటున్నారు. అదే నిజమైతే తాడేపల్లిలో ఎందుకు కేసు నమోదు చేశారనేది ప్రశ్నిస్తున్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు(TDP Leaders) ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఫోన్ పోయిందా లేదంటే.. నాటకాలు ఆడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయి ఫోన్ పోయిందా? జగన్ లాక్కున్నారా? అని మాజీమంత్రి జవహర్(Jawahar) ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమాచారం.. ఆ ఫోన్లోనే ఉందని ఆరోపణలు చేశారు. జగన్(Jagan)తోపాటుగా అందరి వాటాల సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఈడీ విచారణలో బయటకు వస్తుందనే నాటకాలు ఆడుతున్నారన్నారు.
మరోవైపు ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదని, ఆయనే పడేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలస్ లో కదులుతున్నాయని ట్వీట్ చేశారు. ఫోన్ దాచి.. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.