Nagababu Takes Oath : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన నేత కొణిదల నాగబాబు, బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు నేతలతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాగా... బీజేపీ నేతలు ఆయనను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి, ఇతర నాయకులు సోము వీర్రాజును శాలువా, పూలదండలతో సత్కరించారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు శాసనమండలి సభ్యునిగా బుధవారం మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా బుధవారం శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలువురు శుభాకాంక్షలు తెలియచేశారు.
"ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నాకు అవకాశం కల్పించి,శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు అప్పజెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా నా బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ప్రజా సంక్షేమం, జవాబుదారీతనం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో శాసనమండలి సభ్యునిగా నా కర్తవ్యాలను క్రమశిక్షణతో నిర్వహిస్తాను. చట్టసభలో ప్రజాప్రతినిధిగా ప్రజాగళం వినిపించే అవకాశం నాకు లభించేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" -నాగబాబు, ఎమ్మెల్సీ
సంబంధిత కథనం