గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసింది. మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత ఆమె సోదరిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె బయటకు పరుగులు తీయడంతో స్థానికులు అడ్డుకుని…. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు నిందితుడు…. స్థానికుల వద్ద నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని ఒక కాలనీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. తాడేపల్లి పట్టణంలోని ఒక కాలనీలో ఓ మహిళ నివాసం ఉంటుంది. తన భర్తను వదిలేసి…. తన తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి అంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళలకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పదేళ్లు, రెండో కుమార్తెకు తొమ్మిదేళ్లు. మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భర్తను వదిలేయడం, అవగాహన రాహిత్యంతో ఆ మహిళ మద్యానికి బానిస అయింది.
తల్లి మద్యానికి బానిస కావడంతో చిన్నారుల జీవితం దుర్భరంగా సాగుతోంది. అయితే ఆ చిన్నారులపై మేనమామ అంకబాబు కన్ను పడింది. చిన్నారుల తల్లి మద్యానికి బానిస కావడాన్ని అదునుగా చూసుకుని…. పదేళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరికీ చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఆ బాలిక ఉంది. ఆదరిస్తాడుకున్న మేనమామే తమ పరిస్థితిని ఆసరాగా తీసుకుని తనపై అఘాయిత్యం చేయడంతో ఆ బాలిక బాధను తనలోతానే దిగమింగుకుంది.
సీన్ కట్ చేస్తే… అంకబాబు కన్ను రెండో బాలికపై పడింది. బుధవారం చిన్నారుల తల్లి మద్యం తాగి ఉన్నప్పుడు ఆమె రెండో కుమార్తెతో అంకబాబు అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఏం జరిగిందని పక్కంటి మహిళల ఆరా తీశారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయం మహిళలకు వివరించింది. దీంతో స్థానిక మహిళలు ఇంట్లో ఉన్న అంకబాబును బయటకు ఈడ్చుకొచ్చి దేహశుద్ధి చేశారు. నిందితుడిని చితకబాదిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చే లోగా నిందితుడు అంకబాబు స్థానికుల వద్ద నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
తాడేపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంకబాబు కోసం గాలిస్తున్నామని…. వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుని…. పోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.