మూడేళ్ల‌లో వంద శాతం అమరావతి ప‌నులు పూర్తి చేస్తాం - మంత్రి నారాయణ-minister narayana key announcement on capital city amaravati works ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మూడేళ్ల‌లో వంద శాతం అమరావతి ప‌నులు పూర్తి చేస్తాం - మంత్రి నారాయణ

మూడేళ్ల‌లో వంద శాతం అమరావతి ప‌నులు పూర్తి చేస్తాం - మంత్రి నారాయణ

మూడేళ్ల‌లో మాట ఇచ్చిన విధంగా అమ‌రావ‌తి నిర్మాణ పనులను వంద‌శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.వ‌చ్చే మార్చి నాటికి ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌తో పాటు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్ప‌న పూర్తి చేస్తామని చెప్పారు.

మూడేళ్ల‌లో వంద శాతం రాజ‌ధాని ప‌నులు పూర్తి చేస్తాం - మంత్రి నారాయణ

రాజ‌ధాని నిర్మాణంపై కొంత‌మంది పనిగ‌ట్టుకుని చేసే దుష్ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయ‌ణ కోరారు. ప్ర‌జ‌ల‌కు,అమ‌రావ‌తి రైతుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం మూడేళ్ల‌లో ఖ‌చ్చితంగా నూటికి నూరు శాతం రాజ‌ధాని ప‌నులు పూర్తిచేసి తీరుతామ‌న్నారు.

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల‌తో క‌లిసి నేల‌పాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు,గెజిటెడ్ అధికారులు టైప్ - 1,టైప్ -2,గ్రూప్ - డి ఉద్యోగుల క్వార్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. అక్క‌డ ప‌నులు జ‌రుగుతున్న వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత నేల‌పాడులో మీడియాతో మాట్లాడారు.

గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిపై క‌క్ష‌తో ప్ర‌జ‌ల సొమ్మును దుర్వినియోగం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. “అమ‌రావ‌తి విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాల‌తో వాటిని స‌రిదిద్దేందుకు ఏడాది ప‌ట్టింది. పాత టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌లేదు. కాంట్రాక్ట‌ర్ల‌కు డ‌బ్బులు చెల్లించ‌లేదు...న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు క‌మిటీలు వేసి అన్నీ ప‌రిష్క‌రించాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత గ‌తంలో మ‌ధ్య‌లో నిలిచిపోయిన నిర్మాణాల ప‌టిష్ట‌త విష‌యంలో ఐఐటీ చెన్నై,ఐఐటీ హైద‌రాబాద్ నిపుణుల‌తో క‌మిటీలు వేశాం. ఎట్ట‌కేల‌కు అన్ని నివేదిక‌ల ఆధారంగా తిరిగి కొత్త‌గా టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించాం. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో సుమారు ప‌దివేల మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు.అవ‌స‌ర‌మైన యంత్రాలు కూడా ఇప్ప‌టికే ప‌నుల్లో ఉన్నాయి” అని మంత్రి నారాయణ వివరించారు.

ముఖ్యమైన వివరాలు….

  • నాన్ - గెజిటెడ్ ఆఫీస‌ర్స్ కోసం మొత్తం 21 ట‌వ‌ర్ల‌లో 1995 ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 9 ట‌వ‌ర్ల నిర్మాణం పూర్తయింది.మిగ‌తా ట‌వ‌ర్ల నిర్మాణం డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్త‌వుతుంది.
  • ఇక గెజిటెడ్ ఆఫీస‌ర్ల కోసం మొత్తం 14 ట‌వ‌ర్లలో 1140 ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 11 ట‌వ‌ర్ల నిర్మాణం పూర్త‌యింది.మ‌రో 5 ట‌వ‌ర్ల నిర్మాణం వేగంగా జ‌రుగుతుంది.ట
  • భ‌వ‌నాల నిర్మాణాల‌తో పాటు రోడ్లు,తాగునీరు,డ్రైనేజి నిర్మాణాలు కూడా స‌మాంతరంగా జ‌రుగుతున్నాయి.మొత్తం 4000 ఫ్లాట్ల నిర్మాణంతో ఒక టౌన్ షిప్ త‌యారుకానుంది..
  • భ‌వ‌నాల నిర్మాణం మాత్ర‌మే కాకుండా ఇక్క‌డ నివాసం ఉండే వారికోసం అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తున్నాం. ఎస్ ఆర్ ఎం, విట్ యూనివ‌ర్శిటీలు అమ‌రావ‌తిలో మెడిక‌ల్ కాలేజీలు నెల‌కొల్పుతున్నాయి. ముందుగా ఈ రెండు యూనివ‌ర్శిటీలు 50 చొప్పున ప‌డ‌క‌ల‌తో రెండు హాస్పిట‌ల్స్ వ‌చ్చే మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నాయి.
  • ఈ రెండు యూనివ‌ర్శిటీలు రెండు సీబీఎస్ఈ స్కూల్స్ వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటికి ఏర్పాటుచేయ‌నున్నాయి" అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఆ ప్లాట్ల‌లో త్వ‌ర‌లో అభివృద్ది ప‌నులు - మంత్రి నారాయణ

రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌కు తిరిగిచ్చిన ప్లాట్ల‌లో అభివృద్ది ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. వ‌ర్షాల వ‌ల్ల కొంచెం ఇబ్బంది ఉంద‌ని....ఆయా ప‌నుల‌కు ఇప్ప‌టికే టెండ‌ర్లు కూడా పూర్తి చేసామ‌ని అన్నారు.360 కిమీ మేర ట్రంక్ రోడ్లు,1500 కిలోమీట‌ర్ల మేర లేఅవుట్ రోడ్ల‌కు టెండ‌ర్లు పూర్త‌య్యాయని వివరించారు. కొండ‌వీటి వాగు,పాల‌వాగు,గ్రావిటీ కెనాల్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు.

2014-19 మ‌ధ్య సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్నామని మంత్రి నారాయణ గుర్తు చేశారు. ఆ దేశ ప్ర‌ధాని,ఇత‌ర అధికారుల‌తో చ‌ర్చించి క‌మిటీలు వేసి అమ‌రావ‌తి అభివృద్ది కోసం ముందుకెళ్లామని చెప్పారు. రాజ‌ధానిలో 1450 ఎక‌రాలు భూమిని స్విస్ ఛాలెంజ్ విధానంలో 42:58 నిష్ప‌త్తిలో కేటాయించామన్నారు. దీనివ‌ల్ల అమరావ‌తికి పెద్ద కంపెనీలు,బ్యాంకులు వ‌స్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వ‌చ్చేవని చెప్పుకొచ్చారు.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సింగ‌పూర్ అధికారుల‌పై కేసులు పెట్టారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు. అక్క‌డికి వెళ్లి మ‌రీ వారిని వేధించారన్నారు. దీంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి ఏపీ స‌ర్కార్ కు మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయని చెప్పారు.సీఎం చంద్రబాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఏపీ ప్ర‌భుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా స‌మావేశాలు జ‌రుగుతాయని చెప్పుకొచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.