రాజధాని నిర్మాణంపై కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కోరారు. ప్రజలకు,అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం రాజధాని పనులు పూర్తిచేసి తీరుతామన్నారు.
అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్లతో కలిసి నేలపాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు,గెజిటెడ్ అధికారులు టైప్ - 1,టైప్ -2,గ్రూప్ - డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. అక్కడ పనులు జరుగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేలపాడులో మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం అమరావతిపై కక్షతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. “అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలతో వాటిని సరిదిద్దేందుకు ఏడాది పట్టింది. పాత టెండర్లు రద్దు చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదు...న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు కమిటీలు వేసి అన్నీ పరిష్కరించాల్సి వచ్చింది. ఆ తర్వాత గతంలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత విషయంలో ఐఐటీ చెన్నై,ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీలు వేశాం. ఎట్టకేలకు అన్ని నివేదికల ఆధారంగా తిరిగి కొత్తగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. ప్రస్తుతం అమరావతిలో సుమారు పదివేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.అవసరమైన యంత్రాలు కూడా ఇప్పటికే పనుల్లో ఉన్నాయి” అని మంత్రి నారాయణ వివరించారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగిచ్చిన ప్లాట్లలో అభివృద్ది పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉందని....ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేసామని అన్నారు.360 కిమీ మేర ట్రంక్ రోడ్లు,1500 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లకు టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. కొండవీటి వాగు,పాలవాగు,గ్రావిటీ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు.
2014-19 మధ్య సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని మంత్రి నారాయణ గుర్తు చేశారు. ఆ దేశ ప్రధాని,ఇతర అధికారులతో చర్చించి కమిటీలు వేసి అమరావతి అభివృద్ది కోసం ముందుకెళ్లామని చెప్పారు. రాజధానిలో 1450 ఎకరాలు భూమిని స్విస్ ఛాలెంజ్ విధానంలో 42:58 నిష్పత్తిలో కేటాయించామన్నారు. దీనివల్ల అమరావతికి పెద్ద కంపెనీలు,బ్యాంకులు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేవని చెప్పుకొచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు. అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారన్నారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పారు.సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా సమావేశాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు.