Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌-minister nara lokesh inaugurated ashok leyland plant in mallavalli krishna district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Sarath Chandra.B HT Telugu

Ashok Leyland: కృష్ణా జిల్లా మల్లవల్లి అశోక్‌ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంటును మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత మల్లవల్లిలో అశోక్ లేలాండ్‌ సంస్థ ప్లాంటును నిర్మించినా ఆ తర్వాతి కాలంలో అది ప్రారంభం కాలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్లాంటు కార్యకలాపాలు మొదలయ్యాయి.

కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంట్ ప్రారంభోత్సవంలో నారా లోకేష్‌

Ashok Leyland: ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇటీవల నేను డిల్లీలో ఒక ప్రముఖ ఛానల్ ఫైర్‌సైడ్ చాట్ కోసం వెళ్ళాను. అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయని ఏపీకి ఏం ఉందని అడిగారని, ఏపీలో సిబిఎన్ ఉన్నారని తాను గర్వంగా చెప్పానన్నారు.

చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ముందుకు సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ చేతులమీదుగా ప్రారంభించారు. అశోక్ లేలాండ్ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంటు వద్దకు విచ్చేసారు. ప్లాంటు ఆవరణలో మొక్క నాటిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్లాంటును ప్రారంభించారు.

తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎం ఎస్ ఆర్టీసి బస్సులను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మల్లవల్లిలో అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి ఉండటం ఒక గౌరవం గా భావిస్తున్నట్టు చెప్పారు.

2023 ఆగస్టు 24న నా పాదయాత్రలో మల్లవల్లికి వచ్చినపుడు అశోక్ లేలాండ్‌ను తిరిగి తీసుకు వస్తామని హామీ ఇచ్చానని అది నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అశోక్ లేలాండ్, హిందూజా గ్రూపునకు చెందిన పెద్దలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు. దేశచరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చామని మీరు సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి మరో 4 పరోక్ష ఉద్యోగాలు తోడై రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పునరుజ్జీవనానికి చిహ్నంగా మార్చేందుకు మీవంటి వారి భాగస్వామ్యం మాకు శక్తినిస్తుంది. స్థిరమైన అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ప్రకాశవంతమైన, పచ్చని, స్థిరమైన రేపటి భవితవైపు ముందుకు సాగుదాం. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులకు గమ్యస్థానంగా, తయారీరంగంలో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వ చర్యలకు పారిపోయిన పరిశ్రమలు

2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించిందని లోకేష్ ఆరోపించారు. దీనివల్ల వ్యాపారాలు సజావుగా నడవడమే కష్టమైందని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA) రద్దు వంటి తిరోగమన విధానాలు రాష్ట్రంలో అనిశ్చితిని సృష్టించాయన్నారు. అనేక కంపెనీలను వేధించడంతో వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని ఏపీలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల్లో ఒకరైన అమర రాజా వంటి ప్రఖ్యాత పెట్టుబడిదారులు, లులు వంటి పెద్ద సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయన్నారు.

జాకీ వంటి కంపెనీలు కూడా రాష్ట్రం నుండి పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లాయని దురదృష్టవశాత్తు గతపాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేలాండ్ కూడా ఒకటన్నారు. 1360 ఎకరాల్లో 2014-19 నడుమ టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన మల్లవల్లి పారిశ్రామిక పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. తాము ఒప్పందాలు చేసుకున్న 450 కంపెనీల్లో చాలావరకు గత వైసీపీ పాలకుల వేధింపుల కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదన్నారు.

పరిశ్రమదారుల్లో విశ్వాసానికి చర్యలు

రాష్ట్రానికి కొత్త పెట్టుబడుదారులను ఆహ్వానించే ముందు వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ ప్లాంట్ అశోక్ లేలాండ్‌కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. అశోక్ లేలాండ్ కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారని ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని ఇది అశోక్ లేలాండ్ నిబద్ధతను సూచిస్తుందన్నారు.

ఈ ప్లాంట్ ద్వారా ల మొదటిదశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఇది పరిసర ప్రాంతాలను శక్తివంతం చేయడమేగాక సామాజిక-ఆర్థిక వృద్ధి పెంపుదలకు దోహదపడుతుందన్నారు. అశోక్ లేలాండ్ BSVI బస్ మోడళ్ల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వెహికల్ బాడీ బిల్డింగ్ సామర్థ్యం స్థిరమైన అభివృద్ధి, నిబద్ధతకు నిదర్శనం. ఇది ప్రధాని మోడీ సంకల్పమైన 'ఆత్మ నిర్భర్ భారత్' లక్ష్యాలను చేరుకునేందుకు సహయపడుతుంది. దార్శనికత, అధునాతన పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉపకరిస్తుందన్నారు.

ఎపిలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు

ప్రభుత్వపరంగా వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్థిరమైన విధానాలతో మేం ముందుకు సాగుతున్నామని నారా లోకేష్ చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించాం. ఫలితంగా ఆర్సెలర్ మిట్టల్, BPCL, TCS, NTPC, LG, టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు గత తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. వీటిద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని చెప్పారు

ఆంధ్రప్రదేశ్‌పైన మా నాయకత్వంపైన నమ్మకం ఉంచినందుకు అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్ అధినేతలు అశోక్ హిందూజా, ధీరజ్ హిందూజా, షోమ్ హిందూజా, షేను అగర్వాల్, గణేష్ మణి, స్విచ్ మొబిలిటీకి చెందిన మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం