Minister Harish Rao On Group - 4 Jobs: త్వరలోనే గ్రూప్ - 4 నోటిఫికేషన్
group 4 jobs in telangana: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు.
minister harish rao on group 4 jobs: త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పారు మంత్రి హరీశ్ రావ్. సిద్ధిపేటలో మల్టీ పర్పస్ హైస్కూలులో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. మంత్రి చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ శిబిర తరగతులు నిర్వహిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్ధిపేట, గజ్వేల్ లో ప్రిలిమినరీ-రాత పరీక్షకు 1030 మందికి శిక్షణ అందించారు. ఈ శిబిరంలో శిక్షణ పొంది 580 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆసక్తి ఉన్న వారికి రెండవ దశలో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీరంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే.. ఒక ప్రజాప్రతినిధిగా అదే మాకు నిజమైన ఆనందమని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తూ.. అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్యని విమర్శించారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించనున్నదని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇందులో 17 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలే ఉన్నాయని చెప్పారు. గ్రూప్ 4 తో పాటు ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
మోదీపై ఫైర్...
తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు."ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ..! దేశానికీ తెలంగాణ కు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ.." అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సింగరేణిపై అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.