YCP vs TDP : టీడీపీది మేనిఫెస్టో కాదు... మోసఫెస్టో: మంత్రి అంబటి
Minister Ambati Rambabu: టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. అది ఒక మోస ఫెస్టో అంటూ ధ్వజమెత్తారు.
Minister Ambati On TDP Manifesto: టీడీపీది మేనిఫెస్టో కాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. అదొక మోస ఫెస్టో అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక్క పేదవాడ్నయినా ధనికుడ్ని చేశారా అంటూ ప్రశ్నించారు. రుణమాఫీ మోసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదంటూ దుయ్యబట్టారు. ఎవరెన్ని చేసినా గెలిచేది జగనే అని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాట్లాడిన మంత్రి అంబటి…. టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ట్రెండింగ్ వార్తలు
మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు మంత్రి అంబటి. రాజకీయాల్లో సీఎం జగన్ ఓ ట్రెండ్ సెట్టర్ అని వ్యాఖ్యానించారు.మేనిఫెస్టోను అత్యంత పవిత్రంగా భావించి... ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మేనిఫెస్టో అయినా అమలు చేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టో ఓ బూటకం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి అంబటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టో సంగతేంటో ప్రజల్లో చర్చ జరగాలని.... ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని అంబటి చెప్పుకొచ్చారు.
"జగన్మోహన్ రెడ్డిది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏ మేరకు అమలైందో చర్చ జరగాలి. మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరకి వెళ్తున్నాం. ప్రజలకు ఏం చేశామో చెబుతున్నాం. గడప గడప కార్యక్రమంలో చేసిన పనిని చెప్పుకుంటున్నాం. అలాంటి చరిత్ర వైసీపీది. వాగ్ధానాలను అమలు చేయలేని వ్యక్తి మళ్లీ కొత్తగా మేనిఫెస్టోలు చెబుతున్నాడు" అంటూ అంబటి ఘాటుగా మాట్లాడారు.
సంబంధిత కథనం