Tirumala Vaikunta Darsanam: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఇలా చేయండి…జనవరి 9 నుంచి జారీ-maximize your chances of getting tirumala vaikunta dwara darshan tokens ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Vaikunta Darsanam: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఇలా చేయండి…జనవరి 9 నుంచి జారీ

Tirumala Vaikunta Darsanam: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఇలా చేయండి…జనవరి 9 నుంచి జారీ

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 07, 2025 07:59 AM IST

Tirumala Vaikunta Darsanam: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్య ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. జనవరి 9 నుంచి టోకెన్లు జారీ చేస్తారు.

డిసెంబర్ 9 నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ
డిసెంబర్ 9 నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ

Tirumala Vaikunta Darsanam: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. జనవరి 10 నుంచి 19 వరకు పదిరోజుల పాటు దర్శనాలు కల్పిస్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తుల తరలి రానుండటంతో టీటీడీ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం దాదాపు 7లక్షల మంది భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.

yearly horoscope entry point
  • వైకుంఠ ద్వార దర్శనాల కోసం వచ్చే భక్తులు ముందే టైమ్ స్లాట్‌ టోకెన్లను పొందాల్సి ఉంటుంది.
  • తిరుమల క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా ముందే టైమ్‌ స్లాట్‌ తీసుకోవడం ద్వారా దర్శనం పూర్తి చేసుకోవచ్చు.
  • టైమ్ స్లాట్‌ టోకెన్లు ఉన్న భక్తుల్ని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
  • తిరుపతిలోని పది ప్రాంతాల్లో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
  • జీవకోన జడ్పీ హైస్కూల్, తిరుపతి, 2. ఎమ్మార్‌పల్లి హైస్కూల్ తిరుపతి, 3. రామచంద్ర పుష్కరిణి, 4.రామానాయుడు హైస్కూల్, బైరాగిపల్లి, తిరుపతి, 5. ఇందిరా మైదానం, తిరుపతి, 6. శ్రీనివాసం కాంప్లెక్స్‌, తిరుపతి, 7.విష్ణు నివాసం, తిరుపతి, 8. భూదేవి కాంప్లెక్స్‌, తిరుపతితో పాటు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టైమ్‌ స్లాట్ టోకెన్లు జారీ చేస్తారు.
  • జనవరి 9 వ తేదీ ఉదయం 5గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. తొలి రోజు 10,11,12 తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. మూడు రోజుల కోటా పూర్తయ్యే వరకు టోకెన్లు జారీ చేస్తారు.
  • 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దర్శనాల టోకెన్లను శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో మాత్రమే జారీ చేస్తారు. శ్రీవారి మెట్టు కౌంటర్లను 19వ తేదీ వరకు మూసేస్తారు.
  • జనవరి 9వ తేదీ దర్శనాలకు తిరుపతిలో టోకెన్లను జారీ చేయరు.
  • వైకుంఠ ద్వార దర్శనం జరిగే పదిరోజుల పాటు తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలను అనుమతించరు. భక్తులు టోకెన్లు జారీ చేసిన తర్వాత తమకు కేటాయించిన సమయాన్ని బట్టి తిరుమల పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో పరిమిత సంఖ్యలో గదులు ఉన్నందున రద్దీకి తగ్గట్టుగా తిరుమల చేరుకునేలా జాగ్రత్త వహించాలని సూచించారు.

సామాన్య భక్తులకు పెద్ద పీట

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని టిటిడి చైర్మెన్ బీఆర్. నాయుడు తెలిపారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా టిటిడి అధికారులు, మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారన్నారు.

జనవరి 13 నుండి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Whats_app_banner