WakeUp Whatsapp: మొరాయిస్తున్న మన మిత్ర… వాట్సాప్‌ సేవలకు అంతరాయం, తొలినాళ్లలోనే అవంతరాలు-mana mitra services are failing whatsapp services are being disrupted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Wakeup Whatsapp: మొరాయిస్తున్న మన మిత్ర… వాట్సాప్‌ సేవలకు అంతరాయం, తొలినాళ్లలోనే అవంతరాలు

WakeUp Whatsapp: మొరాయిస్తున్న మన మిత్ర… వాట్సాప్‌ సేవలకు అంతరాయం, తొలినాళ్లలోనే అవంతరాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Feb 03, 2025 12:42 PM IST

WakeUp Whatsapp: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సరళవంతమైన పౌరసేవల్ని అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్‌ సేవలు మొరాయిస్తున్నాయి. గత వారం మంత్రి నారా లోకేష్‌ మెటా భాగస్వామ్యంతో మనమిత్ర వాట్సాప్‌ సేవల్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు 161 సేవల్ని వాట్సాప్‌లోనే అందుకోవచ్చని ప్రకటించారు.

మొరాయిస్తున్న వాట్సాప్‌ మనమిత్ర సేవలు
మొరాయిస్తున్న వాట్సాప్‌ మనమిత్ర సేవలు (HT_PRINT)

WakeUp Whatsapp: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్‌ సేవలు ఆరంభంలోనే మొరాయిస్తున్నాయి. గత వారం ఏపీ మంత్రి నారా లోకేష్ మెటా భాగస్వామ్యంతో సులభతరమైన పౌరసేవల్ని అందించే మన మిత్ర వాట్సాప్‌ సర్వీసెస్‌ ప్రారంభించారు.

బటన్‌ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ కోసం మెటాతో పలు మార్లు చర్చలు జరిపామని, అక్టోబర్ 23, 24న ఒప్పందం చేసుకుని డిసెంబర్‌ నెలకల్లా సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు లోకేష్‌ చెప్పారు.

మొదటి విడతలో 161 సేవలు, రెండో విడతలో 360రకాల సేవల్ని వాట్సాప్‌లోనే అందిస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల మీద క్యూ ఆర్‌ కోడ్‌లతో జారీ చేస్తామని, వాటిని స్కాన్‌ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవుతాయని, నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని లోకేష్‌ వివరించారు. రెవిన్యూ, మునిసిపల్, ఎండోమెంట్ సేవల్ని వాట్సాప్‌లో అందిస్తామన్నారు. టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవల్ని వాట్సాప్‌లో అందిస్తామన్నారు.

ఆర్టీసీ సేవలు కావాలంటే ఏఐ బోట్‌ సేవలు కూడా అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. పాదయాత్రలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎదురయ్యే చెడు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ,ప్రజలకు సౌకర్యవంతంగా ప్రభుత్వ సేవలను అందుకునేలా వాట్సాప్‌ సాయంతో సర్టిఫికెట్లను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు లోకేష్‌ చెప్పారు.

తొలివిడతలో 161 రకాల సేవల్ని వాట్సాప్‌ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వ సేవల్ని వాట్సాప్‌లోనే అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

తొలిరోజే వాట్సాప్‌ పేజీ క్రాష్‌…

మనమిత్ర పేజీని ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వాట్సాప్‌లోనే అన్ని రకాల సేవల్ని పొందవచ్చని ప్రకటించారు. గతవారం మనమిత్రను ప్రారంభించక ముందు కొంత స్పందించినా ఆ తర్వాత అది మొరాయించింది. పెద్ద ఎత్తున ప్రజలు రకరకాల సేవల కోసం ప్రయత్నించడంతో రద్దీ పెరిగినట్టు చెప్పారు. ఆ తర్వాత నాలుగైదు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు.

ఉలుకు పలుకు లేకుండా…

వాట్సాప్‌ ద్వారా పౌర సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం గత వారం లాంఛనంగా ప్రారంభించింది. దీనికోసం 95523 00009 నంబరు సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ఆ నంబరులో కావాల్సిన సేవలు పొందవచ్చు. Hi అని మెసేజ్ చేయగానే సేవల జాబితా ప్రత్యక్షం అవుతుంది.

తొలివిడతలో 161 రకాల సేవల్ని వాట్సాప్‌ మనమిత్ర ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు. ఇందులో దేవాలయ సేవల బుకింగ్, ప్రజాఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఏపీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు, సిఎంఆర్‌ఎఫ్‌ సేవలు, రెవిన్యూ, హెల్త్‌, పోలీస్ శాఖల సేవలు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో లబించే సేవల్ని వాట్సాప్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ ద్వారా చేసిన ఫిర్యాదుల స్థితిని మనమిత్ర వాట్సాప్‌ పేజీలో తెలుసుకోవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్‌, రద్దు సేవల్ని పొందవచ్చు.

ఏపీలోని మూడు టెలికం డిస్కమ్‌ల‌కు సంబంధించిన విద్యుత్‌ బిల్లులలను చెల్లించవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుల స్థితిని తెలుసుకోవచ్చు. సిడిఎంఏ సేవల్ని మనమిత్రలో పొందవచ్చు. రెవిన్యూ శాఖ ద్వాారా అందించే పలు రకాల సేవల్ని వాట్సాప్‌లోనే పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన సేవల్ని కూడా వాట్సాప్‌లోనే పొందవచ్చు. పోలీస్ శాఖ అందించే వివిధ రకాల సేవల్ని వాట్పాప్‌లోనే పొందవచ్చని ప్రకటించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు…

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్‌లోనే కావాల్సిన సేవలు లభిస్తాయని చెప్పారు. వాట్సాప్‌కు ఫిర్యాదు కూడా చేయాల్సిన పని లేకుండా సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాట్సాప్‌ సేవల్ని ప్రారంభించిన తొలినాళ్లలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని వాటిని అధిగమిస్తామని ప్రభుత్వం వివరించారు. మెటా పూర్తి ఉచితంగా ఏపీలో గవర్నెన్స్‌లో భాగస్వామ్యం వహిస్తోందని, ఇందుకోసం ప్రభుత్వ పర్యవేక్షణలో ఏపీలోనే సొంతంగా మెటా సర్వర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

మనమిత్రను ప్రారంభించిన తొలినాళ్లలోనే మెటా సేవల్లో అంతరాయం కలగడంతో ప్రజల్లో అనాసక్తత నెలకొంది. జనన, మరణ ధృవీకరణలు వాట్సాప్‌లోనే వస్తాయని ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన ఏ సేవల్ని ఎంచుకున్నా తిరిగి మెయిన్‌ మెనూకు వెళ్లిపోవడం, స్పందన లేకుండా ఉండిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీలైనంత త్వరా వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం