ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ, కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆలయంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గత ఏడాది సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం నిర్వహించిన విషయం సంగతి తెలిసిందే. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు.
కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు. ఈవో ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం శుక్రవారం అధికారులతో సమీక్షించారు.
శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 – 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జేఈవో సూచించారు. ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం రాష్ట్ర పండుగ లాంటిదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్వామివారి ముత్యాల తలంబ్రాలు తయారీ, పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకు వసతి, ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
భక్తులకు ఎండ వేడిమి, అనుకోకుండా వర్షం వస్తే ఉపశమనం కలిగేలా ఏర్పాట్లు చేయాలని జేఈవో వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఎండ వేడిమికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేందుకు అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం