Bail for Magunta Raghav: మాగుంట రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీహైకోర్టు
Bail for Magunta Raghav: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఈడీ అరెస్ట్ చేసిన మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మాగుంట రాఘవ్ అమ్మమ్మ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె సంరక్షణ చూడటం కోసం రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేశారు.
Bail for Magunta Raghav: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్టైన మాగుంట రాఘవ రెడ్డికి ఢిల్లీ హైకోర్టు రెండు వారాల బెయిల్ మంజూరు చేసింది. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె సంరక్షణ బాధ్యతలు తనపై ఉన్నాయని మాగుంట రాఘవ్ కోర్టును అభ్యర్థించారు. మాగుంట రాఘవ్ అమ్మమ్మకు సంబంధించిన హెల్త్ ఫైల్ను సమర్పించి ఆరువారాల బెయిల్ కోరారు. దీంతో మానవతా ధృక్పథంతో రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వ్యవహారంలో మాగుంట రాఘవ్ను ఈడీ ఫిబ్రవరి 10న అరెస్ట్ చేసింది. కొంత కాలంగా మాగుంట రాఘవరెడ్డి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మరో నిందితుడు శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ గా మారిన నేపధ్యంలో రాఘవకు కూడా ఉపశమనం లభించినట్టైంది.
కొనసాగుతూనే ఉన్న లిక్కర్ కేసు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత ఫిబ్రవరిలో మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్నారు.
గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కవితకు వ్యక్తిగత ఆడిటర్గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ.
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.
ఈడీ ప్రస్తావించిన కీలక అంశాలు:
లిక్కర్ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది ఈడీ. ఇందులో ఐదుగురి పేర్లతో పాటు ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్బాబు, అమిత్ అరోరాలను నిందితులుగా చేర్చింది.
మనీలాండరింగ్కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్లో ఈడీ పేర్కొంది. తీహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రు, శరత్రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అమిత్ అరోరా, ఇటీవల అప్రూవర్గా మారిన దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్సింగ్, నరేంద్ర సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్లో ప్రస్తావించింది.
సంబంధిత కథనం