Kadapa : కడపలో పడగ విప్పిన ప్రేమ కత్తి.. యువతిపై 14 కత్తిపోట్లు.. ప్రమోన్మాది ఘాతుకం
Kadapa : కడప జిల్లాలో ప్రేమ కత్తి పంజా విసిరింది. ఓ యువతిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. తనను ప్రేమించలేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి.. యువతిపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా వేముల మండలం వి.కొత్తపల్లిలో శనివారం విషాదం జరిగింది. యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వి.కొత్తపల్లికి చెందిన యువతి షర్మిలను యువకుడు కుళ్లాయప్ప ప్రేమిస్తున్నానని గత కొంత కాలంగా వెంటపడుతున్నాడు. అందుకు షర్మిల నిరాకరించింది. దీంతో ఆమెపై కక్షపెంచుకుని దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
శనివారం సాయంత్రం షర్మిల ఒక్కతే ఇంట్లో ఉంది. ఎవరూ లేరని నిర్ధారించుకున్న కుళ్లాయప్ప.. ఇంట్లోకి చొరబడి షర్మిలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తనను ప్రేమించవా? అయితే ఇలానే చావు అంటూ కత్తి దాడి చేశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. షర్మిల కేకలు పెట్టింది. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ దాడిలో షర్మిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర రక్త స్రావం జరగడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. పులివెందులలో ఓ ప్రైవేట్ హాస్పటల్కు తరలించారు. వైద్యులు పరిశీలించి ఆమె శరీరంపై 14 కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మదనపల్లిలో..
ప్రేమికుడిపై ప్రేమికురాలి భర్త దాడి చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. మదనపల్లికి చెందిన ఇంద్ర అనే యువకుడు, ఓ వివాహిత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ చనువుగా తిరుగుతున్నారు. ఫోన్లో ఛాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ప్రియురాలైన వివాహితకు ఫోన్ చేసి ఆసుపత్రి వద్దకు రమ్మన్నాడు. ఆమె ఆసుపత్రి వద్దకు వచ్చి తరువాత ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ప్రేమికురాలి భర్త , ఆయన అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్దకు వచ్చాడు.
చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్న వీరిద్దరినీ చూసి.. ప్రేమికురాలి భర్త, ఆయన అనుచరులు రాళ్లతో దాడి చేశారు. ప్రియుడు ఇంద్రకు గాయాలు అయ్యాయి. దాడి చేసిన వారిని అక్కడే ఉన్న హాస్పటల్ భద్రతా సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన ఇంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొంతకాలంగా ఇంద్రతో తన భార్య చనువుగా తిరుగుతోందని, తన భార్య, ఇంద్ర ఇద్దరూ ముబైల్ ఫోన్లో చాటింగ్ చేసుకుంటున్నారని భర్త తెలిపారు. గాయపడిన ఇంద్రను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి టూ టౌన్ పోలీసులు కేసును నమోదు చేస్తున్నారు. ఇటు ప్రేమికురాలి భర్త నుంచి, మరోవైపు ప్రేమికుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ప్రేమికురాలిని కూడా పోలీసులు విచారించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)