CRDA Airport: సీఆర్డిఏ పరిధిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ఎయిర్ ఇండియా సీఈఓకు లోకేష్ వినతి
CRDA Airport: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన సీఆర్డీఏ పరిధిలో అంతర్జాయీ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సిఇఓ క్యాంప్ బెల్ విల్సన్ కు విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఎయిరిండియా సీఈఓతో భేటీ అయ్యారు.
CRDA Airport: ఏపీలోని ఏడు ఆపరేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా ఈ ఏడాది 52.51లక్షల ప్యాసింజర్ ట్రాఫిక్ సాధించారని విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్) హబ్ ను ఏర్పాటు చేయడంతో పాటు సీఆర్డీఏ పరిధిలో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట నిర్మాణానికి ముందుకు రావాలని ఎయిరిండియా సీఈఓకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

విశాఖలో ఎమ్మార్వో హబ్ ఏర్పాటు చేస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమే గాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని వివరించారు. ప్రతిపాదిత హబ్ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. విమానయానరంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
సిఆర్ డిఎ పరిధిలో దుబాయ్ తరహాలో 3వేల నుంచి 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే గ్లోబల్ యావియేషన్ లో కీలకపాత్ర వహించడంతో పాటు ఏపీకి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు లభిస్తాయని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పైలట్లు/ స్టీవార్డెస్/ టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సీఈఓను కోరారు. గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (GATI) అంచనా ప్రకారం భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాలలో 20వేలమంది పైలట్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పైలట్లకు ఉపశమనం కలిగించేలా పైలట్లను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఫ్లయింగ్ స్కూల్స్ నెలకొల్పాలని మంత్రి లోకేష్ కోరారు.
ఎయిరిండియా ఎండి క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ... ఎయిరిండియా ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఆపరేషనల్ హబ్స్ కలిగి ఉందని మరికొన్ని ఇతర నగరాల్లో MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్) హబ్ లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి ఇటీవల బెంగుళూరులో MRO ఫెసిలిటీని ప్రారంభించినట్టు వివరించారు. ఎయిరిండియా ఫ్లీడ్ అప్ గ్రేడేషన్, అధునిక విమానాలను పరిచయం చేసే ప్రణాళికలు, గ్లోబల్ ఉనికిని బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, సాంకేతికతపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తులపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎపి వర్సిటీలతో కలసి పరిశోధన కార్యక్రమాలకు సహకరించండి
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలసి పరిశోధనా కార్యక్రమాలకు సహకరించండి. వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించండి. ఎపి విశ్వవిద్యాలయాలతో కలసి రాష్ట్రంలో ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.
హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ఎఐ స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టండి
యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మ,త్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.... ఎపిలో ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పేషెంట్ ఫలితాలను మెరుగుపరచడానికి ప్రాసెస్ ఆటోమేషన్ సొల్యూషన్లను అమలు చేయడానికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్లో హెల్త్కేర్, AI, రోబోటిక్స్ స్టార్టప్లలో పెట్టుబడి పెట్టండి. రాష్ట్రంలో క్రికెట్, ఇతర స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా యువత ప్రోత్సాహానికి మీ అనుబంధ సంస్థ అనురాగ్ జైన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.