AP Weather Updates : ఏపీలో మరో 5 రోజులు వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్!
Weather Updates Telugu States: ఏపీకి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Rain Alert to Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. ఓవైపు తెలంగాణకు మరో 4 రోజులు వర్ష సూచన ఇవ్వగా... ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఐఎండీ అంచనాల ప్రకారం ఏపీ విపత్తుల శాఖ వివరాలను ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
శనివారం రోజు ఉత్తరాంధ్ర,గుంటూరు, పల్నాడు,బాపట్ల, ప్రకాశం,అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం,సోమవారం రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మంగళవారం రోజు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడి"పిడుగులు"పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు. రైతులు,కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
TS Weather Updates: రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో దిగువ స్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. ఉపరితలానికి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక గురువారం రాత్రి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.