కర్నూలు నగరంలో ఆర్టీసీ అధికారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్నూలు నగరానికి చెందిన షేక్షావలి మరో ఐదుగురు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దొంగతనానికి గురైన సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ విక్రాంత్పాటిల్ వెల్లడించారు.
షేక్షావలి.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో ఓ హోటల్లో పనిచేస్తూ సంతోష్ నగర్లో ఉండేవాడు. జల్సాలకు అలవాటుపడిన షేక్షావలికి ఐదుగురు మైనర్లతో పరిచయం అయ్యింది. వీరిలో ఇద్దరు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడి గతంలోనే కర్నూలు తాలూకా పోలీసులకు చిక్కారు. ఆ తర్వాత కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ.. జల్సా జీవితం గడిపేవారు.
జల్సాలకు అలవాటుపడిన వీరందరూ.. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేసేవారు. పోలీసులకు చిక్కకుండా ఉండాలని.. యూట్యూబ్ చూసి రంపంతో తాళాలు కోయడం వంటివి నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 12న కర్నూలు గణేశ్ నగర్ వైపు వచ్చిన ఓ మైనర్.. సాయి వైభవ్నగర్లోని సర్దార్ హుస్సేన్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. అదేరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరుగురు కలిసి ఆ ఇంటికి వెళ్లారు. కొందరు ఇంట్లోకి చొరబడగా.. మరికొందరు బయటే ఉన్నారు.
లోపలికి వెళ్లిన వారు తాళంలో నూనె పోసి శబ్దం రాకుండా విరగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. 27 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. 13వ తేదీన పనిమనిషి వచ్చి చూసి చోరీ జరిగినట్లు గుర్తించింది. సమాచారం ఇవ్వగా సర్దాన్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.
ఆర్టీసీ అధికారి ఇంట్లో చోరీ జరిగిన ముందురోజు పగటి వేళ.. పాత చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ మైనర్ ఆ కాలనీలో తిరిగినట్లు గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఆధారం సేకరించి పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న మైనర్ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.
ఈ ఘటనలో చోరీ చేసిన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. రంపం, రాడ్డు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, సీఐలు శేషయ్య, నాగశేఖర్, కానిస్టేబుళ్లను ఎస్పీ విక్రాంత్పాటిల్ అభినందించి రివార్డులు ఇచ్చారు. పోలీస్ నిఘానేత్రాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం