Kurnool Crime : కర్నూలు జిల్లాలో 2021లో ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక కేసులో... పోక్సో కేసుల ప్రత్యేక సెషన్ కోర్డు జడ్జి భూపాల్ రెడ్డి సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అలాగే 20 వేల రూపాయలు జరిమానాను కూడా జడ్జి విధించారు. అలాగే బాధితురాలికి 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
2021 కరోనా లాక్ డౌన్ లో కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బోయ రంగముని అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రతి రోజు అత్యాచారం చేశాడు. ఇలా మూడు రోజుల్లో మూడు సార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే లైంగిక దాడి చేసిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని కీచకుడు బాలికను బెదిరించాడు. అయితే అత్యాచారానికి గురైన బాలిక తీవ్రమైన నొప్పిని భరించలేక పోయింది. దీంతో నొప్పిని భరించలేక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తన తల్లిదండ్రులకు బాలిక చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా హోళీగుంద పోలీస్ స్టేషన్ లో 2021 ఆగస్టు 13న క్రైం నంబర్ 235/2021తో ఐపీసీ సెక్షన్ 448, 506 కింద, అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు అయింది.
అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అన్ని కోణాల్లో కేసును సమగ్రంగా విచారించిన పోక్సో కేసుల ప్రత్యేక సెషన్ కోర్డు జడ్జి జి. భూపాల్ రెడ్డి, రంగమునిని దోషిగా నిర్ధారించారు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 20 వేల రూపాయలు జరిమానాను చెల్లించడంలో విఫలం అయితే అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకు గాను మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంటుంది. బాధితురాలికి ప్రభుత్వాన్ని రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
దర్యాప్తు చేసిన అధికారులను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అభినందించారు. అప్పటి ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. బాధితురాలు తరపున న్యాయవాది గోపాలకృష్ణ వాదించారు. కర్నూలు పోక్సో కేసుల ప్రత్యేక సెషన్ కోర్డు న్యాయవాది వెంకటేశ్వర రెడ్డి, హోళగుంద పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎస్.షేక్షావలిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు