Konaseema Issue | అమలాపురంలో ఆందోళన.. మంత్రి ఇంటికి నిప్పు-konaseema district name issue protestors fire to house of minister pinipe viswarup in amalapuram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema Issue | అమలాపురంలో ఆందోళన.. మంత్రి ఇంటికి నిప్పు

Konaseema Issue | అమలాపురంలో ఆందోళన.. మంత్రి ఇంటికి నిప్పు

HT Telugu Desk HT Telugu

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగారు. అనంతరం ఇంటికి నిప్పంటించారు. దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు కారులో తరలించారు.

మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంపై చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ర్యాలీ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించారు. ఈ కారణంగా ఆయన ఇల్లు మంటల్లో చిక్కుకుంది. కుటుంబసభ్యులు ఇంటి నుంచి పోలీసులు బయటకు తీసుకెళ్లారు.

కొన్ని రోజులుగా.. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంతో ఆందోళన మెుదలైంది. పేరు మార్చడం సరికాదని.., కోనసీమ జిల్లాగానే ఉంచాలని నిరసన సెగ తగిలింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన జరిగింది.

<p>అమలాపురంలో ఆందోళనకారులు</p>
అమలాపురంలో ఆందోళనకారులు

ఆందోళన జరుగుతున్న కారణంగా.. పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో.. ఉద్రిక్తత ఎక్కువైంది. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది యువకులు కలెక్టరేట్ వైపు పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే కొంతమంది ఆందోళన కారులు.. పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. పోలీసులకు,యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. తగ్గని.. ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన నిరసనకారులు.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

<p>గుంపుగా నడుచుకుంటూ వెళ్తున్న నిరసనకారులు</p>
గుంపుగా నడుచుకుంటూ వెళ్తున్న నిరసనకారులు

ప్రజల ఇష్టం మేరకే పేరు మార్చాం: తానేటి వనిత

అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చామన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని చెప్పారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని మంత్రి అన్నారు.

'కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. గొడవలు చేసే వారి వెనక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సులను కూడా తగులబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయి. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నాను.' అని మంత్రి తానేటి వనిత అన్నారు.