KodiKathi Srinivas: రాజకీయాల్లోకి కోడికత్తి శ్రీనివాస్…జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరిన శ్రీనివాస్
KodiKathi Srinivas: విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ రాజకీయాల్లో ప్రవేశించాడు. జడ శ్రావణ్కు చెందిన జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు.
KodiKathi Srinivas: కోడికత్తి శ్రీనుగా గుర్తింపు పొందిన జనిపల్లి శ్రీనివాసరావు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరాడు.
రానున్న అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల తరఫున తన గొంతు వినిపిస్తానని జనిపిల్లి శ్రీనివాస్ ప్రకటించాడు. వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్ భారత్ పార్టీలో చేరారు.
విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఐదున్నరేళ్ల తర్వాత బెయిల్…
కోడికత్తి Kodikathi కేసు నిందితుడు శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ గత నెలలో Bail మంజూరు చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఐదేళ్లుగా నిందితుడు రిమాండ్లో ఉన్నారు. జగన్పై దాడి కేసు నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.
2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్పై దాడి జరిగింది. 2023 వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారిస్తున్న కోడికత్తి కేసును విశాఖపట్నంలో Visakhapatnam కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసులో సాక్ష్యం ఇవ్వాల్సిందిగా పలుమార్లు సిఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినా రకరకాల కారణాలతో హాజరుకాలేదు.
మరోవైపు వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ NIA ) గత ఏడాది కోర్టు విచారణలో స్పష్టం చేసింది. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్కు కూడా ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోరింది. అయితే జగన్ పున్వరిచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో ఈ కేసులోని ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన విషయాలను ఎన్ఐఏ రికార్డు చేసింది.
మిస్టరీగా మిగిలిన జగన్పై దాడి…
ఎన్ఐఏ కోర్టు విచారణలో చార్జ్ షీట్, కౌంటర్తో పాటు ఈ-స్టేట్మెంట్ను ఎన్ఐఏ జతచేసింది. ఇందులో శ్రీనివాసరావు కీలక విషయాలను పేర్కొన్నాడు. తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని... జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నానని పేర్కొన్నాడు. ప్రజల్లో సానుభూతి కోసం జగన్పై అటాక్ చేశానని తెలిపారు మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించినట్లు విచారణలో నిందితుడు పేర్కొన్నాడు.
ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించానని, జగన్కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పినట్టు పేర్కొన్నాడు. తన మాటలకు ఆయన చిరునవ్వు చిందించారని, ఎయిర్ పోర్ట్లో అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు నాపై దాడి చేస్తే పోలీసులు కాపాడి ఓ గదిలో బంధించినట్టు ఛార్జిషీట్లో పేర్కొన్నాడు.
కేసు నేపథ్యం ఇది…
2018లో విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత, సీఎం జగన్పై జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్లో కోర్టుకు హాజరుకావ్వాల్సి ఉండేది. అందుకే గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.
జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. ఫలితంగా ఈ కేసు విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగింది ఎన్ఐఏ. దాాదాపు ఐదేళ్ల తర్వాత జగన్పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు హైకోర్టులో బెయిల్ మంజూరైంది.