Mudragada Padmanabham : ఏపీ రాజకీయాలు ఇప్పుడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకోవాలని నేతలు ముద్రగడ ఇంటికి క్యూకడుతున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంతో వరుసగా భేటీ అవుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగాఆయన టీడీపీ, జనసేన నేతలతో భేటీ అయ్యారు. దీంతో ముద్రగడ ఆలోచన మార్చుకున్నారని ప్రచారం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి పట్టుచిక్కితే వారిదే రాష్ట్రంలో అధికారం దక్కినట్లే. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు చంద్రబాబు, పవన్ ప్రణాళిక వేస్తున్నారు.
అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ముందు ప్రచారం జరగగా, చివరి నిమిషంలో బ్రేక్ పడింది. ఆయన టీడీపీ లేదా జనసేలోకి వెళ్తానని ప్రచారం జరుగుతోంది. దీంతో ముద్రగడను కలిసేందుకు వైసీపీ నేతలు సైతం వెళ్తున్నారు. తనను కలిసేందుకు ఎవరినీ రావొద్దంటున్నారట. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను సైతం కలవడానికి ముద్రగడ ఇష్టపడలేదని సమాచారం. ఇవాళ ముద్రగడను జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి కలిశారు. ముద్రగడ పద్మనాభం లాంటి నిజాయితీగల వారు జనసేనలోకి వస్తే మరింత బలం చేకూరుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ నెలలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముద్రగడతో భేటీ అవుతారన్నారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయని, వాటిని సర్దుకుని ముందుకు వెళ్తామన్నారు. పవన్ కల్యాణ్, ముద్రగడ మధ్య గ్యాప్ ఉంటే వేరే పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ముద్రగడ లాంటి మంచి వ్యక్తి జనసేనలోకి వస్తే సమాజానికి మేలు జరుగుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గత భేటీలో పవన్ కల్యాణ్ రాసిన లేఖను ముద్రగడ అందించారు జనసేన నేతలు. లేఖలోని అంశాలపై ముద్రగడ సానుకూలంగా స్పందించారన్నారు. జనసేనలో చేరిక పై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. టీడీపీ, జనసేన కూటమిలో చేరాలని ముద్రగడను ఆహ్వానించారు.
కొద్ది రోజుల క్రితం ముద్రగడ కుటుంబం వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి నిర్దిష్టమైన హామీ లభించకపోవడంతో ముద్రగడ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత ముద్రగడతో జనసేన నేతలు, టీడీపీ నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముద్రగడ వైసీపీలో చేరడానికి ఆసక్తిగా లేరని ముద్రగడ కుమారుడు గిరిబాబు చెప్పారు. టీడీపీ, జనసేనలో ముద్రగడ చేరుతారని మీడియా చిట్చాట్లో చెప్పారు. కాకినాడ పార్లమెంట్తో పాటు ప్రత్తిపాడు, పిఠాపురంలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తండ్రితో పాటు తాను కూడా పోటీ చేస్తానని చెపారు. జనసేన, టీడీపీల్లో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై ముద్రగడ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.